వైసీపీ అరాచకాలను ప్రజలకు చెబుదాము
అరవ శ్రీధర్ పై త్రిసభ్య కమిటీ నిర్ణయమే ఫైనల్
(అమరావతి,న్యూస్ఇన్)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైసీపీ హయాంలో సాగించిన అరాచకాలను, కల్తీ నెయ్యి సరఫరా గురించి ప్రజలకు తెలియచెప్పాలి అని జనసేన పార్టీ శాసన సభాపక్షం అభిప్రాయపడింది. అసలు నెయ్యే లేకుండా రసాయనాలతో నెయ్యి సరఫరా చేయడమనేది అత్యంత దుర్మార్గమని… ఇది భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే కాదు… వారి ఆరోగ్యాలతో చెలగాటమాడటమే అవుతుందని సభ్యులు స్పష్టం చేశారు. ఇంత అరాచకం చేసి బుకాయింపు మాటలతో ప్రజలను మభ్యపెట్టే చర్యలకు వైసీపీ దిగిందన్నారు. గురువారం మధ్యాహ్నం వర్చ్యువల్ విధానంలో జనసేన పార్టీ శాసన సభా పక్ష సమావేశం సాగింది. విశాఖపట్నం పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఈ సమావేశం సాగింది. ఈ సందర్భంగా వచ్చే నెలలో మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధివిధానాలు, పార్టీ పాలసీ తదితర అంశాలు చర్చకు వచ్చాయి.

రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా, ప్రజా క్షేమమే ధ్యేయంగా చర్చల్లో పాలుపంచుకోవాలని శ్రీ నాదెండ్ల మనోహర్ సూచించారు. చర్చల సందర్భంలో సభ్యులు సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ తిరుపతి లడ్డు విషయంలో గత ప్రభుత్వం చేసిన కల్తీ వ్యవహారంపై సభలో చర్చించాలని, అదే సమయంలో ప్రజలకు కూడా కెమికల్స్ వాడి నెయ్యి తయారు చేసి, దాన్ని తిరుమలకు సరఫరా చేయడంపై ప్రజలకు వివరిద్దామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు గురించి, రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేయబోతున్న మంచి గురించి సభలో చర్చిద్దామన్నారు. ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ లడ్డూ కల్తీపై సభలో చర్చతోపాటు మీడియా, సోషల్ మీడియాల్లో లోతుగా చర్చ చేసి ప్రజలకు వాస్తవాలు వివరించాలని, తప్పు చేసినవాళ్లే ఎదురు దాడి చేయడాన్ని కట్టడి చేద్దామన్నారు. పార్టీ సభ్యులందరూ చర్చల్లో పాలుపంచుకొనే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ కోరారు.

శాసన సభా పక్ష సమావేశంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలు గురించి చర్చించారు. ఆరోపణలు వచ్చిన వెంటనే పార్టీ తరఫున త్రిసభ్య కమిటీ వేసి నిజానిజాలు విచారించాలని ఆదేశాలు ఇవ్వడం ద్వారా పార్టీ ఎంత నిబద్ధతతో ఉంటుందో అధినేత పవన్ కళ్యాణ్ అందరికీ తెలియచేశారని శాసనసభా పక్షం వెల్లడించింది. అరవ శ్రీధర్ సత్వరమే కమిటీ ముందుకు వచ్చి పూర్వాపరాలు, వివరాలు అందించాలని శాసనసభా పక్ష సభ్యులు అభిప్రాయపడ్డారు. కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ అధ్యక్షులు తీసుకొనే నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామని ముక్తకంఠంతో తెలిపారు. శాసన సభ సమావేశాలకు ముందు మరోసారి లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు.
.






Leave a Reply