(హైదరాబాద్, న్యూస్ఇన్)
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలను విచారించిన సిట్… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించాలని నిర్ణయం తీసుకుంది. మూడు రోజులు ముందు మొదటి సారి నోటీసులు కేసీఆర్ కు సిట్ అందజేసింది. ఆ నోటీసులపై కేసీఆర్ విచారణ 30తేదీన సాధ్యం కాదని మరో తేదీని ఖరారు చేయాలని పోలీసులను కోరారు. కెసిఆర్ లేఖను పరిగణలోకి తీసుకున్న సిట్ అధికారులు ఒకరోజు మాత్రమే గ్యాప్ ఇచ్చి… తిరిగి నోటీసులు అందించారు. ఒకటో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మీరు కోరిన చోట విచారిస్తామని మొదటి నోటీసులో వెల్లడించిన పోలీసులు…. రెండో నోటీసులో కేసీఆర్ అధికారిక అడ్రస్ నంది నగర్ లో మాత్రమే ఉందని, తాము అక్కడే విచారిస్తామని రెండో విడత నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. 65 ఏళ్ల పైబడిన వారిని విచారణ జరిపేందుకు వారు కోరిన చోటికి రావాల్సి ఉన్నా…. పోలీసులు అభ్యంతరం చెప్పడంపై బీఆర్ఎస్ లీగల్ సెల్ తప్పుబడుతుంది.

అయితే శుక్రవారం రాత్రి దాదాపు 10 గంటల సమయంలో నోటీసులు కేసీఆర్ నంది నగర్ నివాసం దగ్గర సిబ్బందికి అందజేశారు. దాంతో పాటు గోడకు నోటీసులు అంటించారు. ఈ నోటీసులపై మరోసారి పార్టీ సీనియర్ నేతలతో కేసీఆర్ చర్చించారు. గతంలో ఈ కేసులోనే విచారణ ఎదుర్కొన్న కేటీఆర్,హరీష్,సంతోష్ తో పాటు ఇతర నేతల ద్వారా పోలీసు విచారణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో ఉదయం నుంచి కీలక నేతలు సహా, న్యాయ నిపుణులతో విచారణ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరుపుతున్నారు.

నేతలతో చర్చలు…వ్యూహాలు
పార్టీ అధినేతకే నోటీసులు ఇచ్చి విచారణకు ఆహ్వానించడానికి గులాబీ నేతలు సీరియస్ గా తీసుకుంటున్నారు. విచారణ సందర్భంగా గతంలో ఎదురైన పరిస్థితులు మళ్లీ తలెత్తుతాయని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు. కేటీఆర్,హరీష్ రావు విచారణ సమయంలోనే తెలంగాణ భవన్ కు పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున తరలివచ్చింది. ఆదివారం కెసిఆర్ విచారణ కావడంతో భారీగా తరలివస్తారని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ భవన్లో ఏర్పాట్లను పార్టీ నేతలు మొదలుపెట్టారు.మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు గులాబీ పార్టీ రెడీ అవుతుంది.



Leave a Reply