అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు
దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తా….కేసిఆర్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు వ్యవహరించిన తీరును మాజీ సీఎం తీవ్రంగా విమర్శించారు. అధికారుల తీరు చట్టాలకు విరుద్ధంగా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సిట్ అధికారులకు నోటీసులు ఇచ్చే అధికారమే లేదన్నారు. ఓ మాజీ సీఎం గా ఉన్న తనపై చట్ట విరుద్ధంగా సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ట్యాపింగ్ కేసులో గత కొన్ని రోజులుగా పోలీసులు దూకుడు పెంచడంతో కీలక నేతలందరినీ వరుసగా విచారిస్తున్నారు.అందులో భాగంగా కేసిఆర్ మూడు రోజుల క్రితం మొదటి నోటీసు ఇచ్చారు….. విచారణకు సిద్ధం అని తెలిపిన కేసిఆర్ పోలీసులను సమయం కోరడంతో ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఇచ్చి ఫిబ్రవరి ఒకటో తేదీన విచారణ చేస్తామని పేర్కొన్నారు.
మొదటి సారి నోటీసు ఇచ్చిన సందర్భంలోనే కేసిఆర్ తాను ఎర్రవల్లిలో నివాసం ఉంటున్నానని అక్కడే విచారణకు రావాలని పోలీసులకు అధికారులను కోరారు. తదుపరి విచారణలు ఉన్నా….అన్ని ఎర్రవల్లి అడ్రస్ కే పంపించాలని లేఖలో మొదటి సారి పోలీసులకు తెలియచేశారు.
రెండో నోటీసులో పోలీసులు ఎర్రవల్లి రావడం సాధ్యం కాదని కేసిఆర్ అధికారిక రికార్డుల ప్రకారం నందినగర్ అడ్రస్ లో మాత్రమే తాము విచారిస్తామని అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ విషయంలో పోలీసులు ధ్వంధ విధానాలు అవలంభిచారని కేసిఆర్ ఎండగట్టారు.
కేసిఆర్ అభ్యంతరాలు…..

గుర్తుతెలియని వ్యక్తులు మీ సంతకంతో ఉన్న లేఖను రాత్రి 9 గంటలకు నందినగర్ నివాసంలోని మా ఇంటి గోడకు అతికించినట్లు తెలుస్తోంది.
ఆ లేఖ మీరే పంపినట్లయితే, మీ సూచనల మేరకే అతికించినట్లయితే, ఆ లేఖను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను.
ఇది భారత రాజ్యాంగం, చట్టం మరియు గౌరవ సుప్రీంకోర్టుల పట్ల మీకు ఏమాత్రం గౌరవం లేదు అనే విషయాన్ని సూచిస్తుంది.
గతంలో సుప్రీంకోర్టు ‘సతేంద్ర కుమార్ యాంటిల్ వర్సెస్ సిబిఐ’ అనే కేసులో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా నోటీసులు పంపడం చట్టబద్ధమైన పద్ధతి కాదని, చట్టం నిర్దేశించిన రీతిలోనే నోటీసులు ఇవ్వాలని పేర్కొంది.
CRPC 160 నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాలి.
కానీ మీరు కావాలనే చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు.
ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది.
పోలీసులు ఇచ్చిన రెండవ నోటీసు చట్టబద్ధంగా అందలేదు, అది చెల్లదు.
నేను మీ పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ, పొరుగు పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ నివసించడం లేదు
కాబట్టి మీకు నోటీసు ఇచ్చే అధికార పరిధి లేదు. ఈ నోటీసుతో నన్ను కట్టడి చేసే అధికారం లేదు.
ఎలక్షన్ అఫిడవిట్ లో, అసెంబ్లీ రికార్డులో ఉన్న అడ్రస్ ఆధారంగా ఎర్రవల్లిలో విచారించలేమని మీరు చెప్పడం సరికాదు.
నోటీసు ఇచ్చే సమయానికి వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారు అన్నదే ముఖ్యం.
అక్కడే నా స్టేట్మెంట్ రికార్డ్ చేయవలసిన బాధ్యత పోలీసులపై ఉంటుంది
హరీష్ రావు అఫిడవిట్ లో సిద్దిపేట అని చిరునామా ఉన్నప్పటికీ హైదరాబాద్ లో ఎలా నోటీసు ఇచ్చారు.
ఇది మీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం కాదా

అయినా పోలీసు విచారణకు సహకరిస్తా….
పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేసిఆర్ బాద్యతా యుతంగా వ్యవహరించడం తన బాధ్యత అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని ప్రకటించారు.రేపు 3 గంటలకి నందినగర్ నివాసంలో ఉంటానని వెల్లడించారు. పోలీసులు నందినగర్ నివాసంలోనే స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని పట్టుబట్టినందున అక్కడే అందుబాటులో ఉంటానని వెల్లడించారు.



Leave a Reply