బీజెపి జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ ఎస్ ప్రభుత్వానికి కొనసాగింపుగానే ఉందని కమీషన్లు, అవినీతి మరింత తీవ్రమయ్యాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల సందర్బంగా తొలిసారి రాష్ట్రంలో ప్రచారానికి వచ్చిన ఆయన మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు బుద్ధి చెప్పేందుకు ఈ ఎన్నికలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జాతీయ అధ్యక్షుడిని అయిన తరువాత తొలిసారి తెలంగాణాకు రావడం తన అదృష్టంగా చెప్పుకొచ్చారు. మహబూబ్నగర్ పట్టణ ప్రజలే కాకుండా, ఆదివాసీ సోదరులు తమ సంప్రదాయ నృత్యాలతో నన్ను ఆత్మీయంగా ఆదరించినందుకు వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులను ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు.పలుచోట్ల హిందూ దేవాలయాలపై బహిరంగంగా దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకపోవడం బాధాకరం.

హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఆలయ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు.ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ భవిష్యత్తు కోసం, సంస్కృతి–సంప్రదాయాల రక్షణ కోసం, న్యాయం–సమానత్వం కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చిందని వాటిని ఇప్పుడు అమలు చేయడం లేదని విమర్శించారు.రాష్ట్రంలో కమీషన్ల పేరుతో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి పనులు, బిల్లుల మంజూరుకు చిన్నచిన్న కాంట్రాక్టర్లు కూడా కమీషన్ కట్టాల్సిన దుస్థితి దాపురించిందన్నారు.గత అసెంబ్లీ, లోక సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 35 శాతానికి పైగా ఓటు శాతం సాధించింది. ఈసారి ప్రతి బూత్లో 50% ఓట్లు సాధించడం లక్ష్యంగా కార్యకర్తలు కృషిచేయాలని సూచించారు.




Leave a Reply