జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఎందుకివ్వలేదు
ఏపీ సీఎం చంద్రబాబు
(అమరావతి,న్యూస్ఇన్)
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంతో డబ్బు దోచుకోవడంతో పాటు శ్రీవారి పవిత్రత దెబ్బతీయాలనేదే అసలైన కుట్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భగవంతుడు అంటే లెక్క లేదు… హిందూమతం అంటే విశ్వాసం లేదని, కల్తీ నెయ్యి వ్యవహారంలో దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తిరుమల లడ్డూ విషయంలో గత పాలకులు మహా పాపం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో సీఎఫ్టీఆర్ఐ చాలా స్పష్టంగా కల్తీ జరుగుతోందని చెప్పినా పట్టించుకోకుండా యథేఛ్చగా కొనసాగించారు. లక్షల మంది భక్తులకు అదే కల్తీ నెయ్యిని వాడిన లడ్డూను ప్రసాదంగా ఇచ్చి గత పాలకులు మహా పాపానికి పాల్పడ్డారన్నారు. గత ఐదేళ్లలో లడ్డూ ప్రసాదం తినాలంటేనే భక్తులు భయపడిన పరిస్థితి ఉందన్నారు. మానసికంగా ఇబ్బందులు పడ్డారు. 2022లో వచ్చిన నివేదికను తొక్కిపెట్టి ఉద్దేశపూర్వకంగా అక్రమాలు చేయడానికే గత పాలకులు నాటి నివేదికను దాచారని చెప్పారు. ఈ పని చేసిన చైర్మన్ పీఏ రూ.4 కోట్ల డబ్బులు లంచంగా తీసుకున్నారు”అని సీఎం ఆరోపించారు.

ఇక సిట్ నివేదిక చూస్తే అన్ని రసాయనాలు, పామాయిల్తో నెయ్యి తయారు చేసినట్టు వెలుగు చూసింది. సీబీఐ నివేదికలో కల్తీలేదని ఎక్కడా నిర్ధారించలేదు. కరడు గట్టిన నేరస్తులు అసత్యాన్ని ఎలా నమ్మించాలో ప్రయత్నిస్తారు. ఇప్పుడు వైసీపీ అదే పని చేస్తోందని బాబు అన్నారు.వారు ఏం చేసినా నిస్సహాయంగా మిగిలిపోవాలా? నాడు వివేకానందరెడ్డిని హత్య చేసి నాపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు శ్రీవారి ప్రసాదం కల్తీ చేసి మళ్లీ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. భక్తుల విశ్వాసం, నమ్మకంపైనా దాడి చేస్తున్నారు” అని ముఖ్యమంత్రి మండిపడ్డారు.
తెరపైకి మళ్లీ జగన్ డిక్లరేషన్…..
“జగన్ మోహన్ రెడ్డికి వేంకటేశ్వరస్వామిపై భక్తి ఉంటే డిక్లరేషన్ పై ఎందుకు సంతకం పెట్టలేదు.? అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ పై సంతకం చేశారు. టీటీడీ నిబంధనల ప్రకారం అన్యమతస్తులు డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిందే. డిక్లరేషన్ ఇవ్వకుండా ఇష్టానుసారం వ్యవహరించిన వ్యక్తులు మాపై నిందారోపణలు వేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన దోషులు ఎవరైనా, ప్రజల మనోభావాలతో ఆడుకున్న వారిని ఉపేక్షించే సమస్యే లేదు. ఉద్దేశపూర్వకంగానే శ్రీవేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేయడానికి కుట్ర చేశారు. అన్ని నివేదికలనూ ప్రజల ముందే ఉంచుతాం. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని వదిలిపెట్టబోం. దోషులను కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని బాబు చెప్పారు.








Leave a Reply