బీఆర్ఎస్ పై మరోసారి తీవ్ర విమర్శలు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణాలో మరో రాజకీయ పార్టీ రావడం ఖరారైంది. తెలంగాణా జాగృతి సంస్థ పేరుతో ఇప్పటి గత కొన్ని నెలలుగా రాజకీయాలు చేస్తున్న తాను పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు సెంటిమెంట్లు ఎక్కువని మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నానన్నారు. మూడు నెలల్లో పార్టీ ప్రకటనకు మంచి ముహూర్తం రావచ్చన్న అభిప్రాయన్ని కవిత వ్యక్తం చేశారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మట్లాడిన కవిత బీఆర్ ఎస్ పార్టీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

బీఆర్ ఎస్ తెలంగాణా భవన్ కు , సోషల్ మీడియాకే పరిమితం అయిందని, ఆ పార్టీ నేతలు గుర్తిస్తే తాను లీడర్ ను కానన్నారు. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో చూసుకోవాల్సిన అవసరం బీఆర్ ఎస్ కు ఉందన్నారు. బీఆర్ ఎస్ లో రాష్ట్ర నాయకులుగా ఉన్న కేటిఆర్, హరీష్ రావ్ లు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు బీఆర్ ఎస్ పార్టీ విజయం కోసం ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు. సిరిసిల్లలో 16 మంది బీఆర్ ఎస్ నేతలు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్దకు వచ్చారని కవిత వెల్లడించారు. జాగృతి అభ్యర్థులు పోటీ చేస్తున్న మున్సిపాల్టీల్లోనే హరీష్ రావు ప్రచారం చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. హరీష్ రావ్ కు- గుంట నక్క అనే పేరు సంతోష్ రావ్ కు- గూఢాచారి అనే పేర్లు సరిగ్గా సూట్ అవుతున్నందు వల్లే తాను అలా పిలుస్తానని కవిత స్పష్టం చేశారు. జగిత్యాలలో జరుగుతున్న కాంగ్రెస్ రాజకీయాలపై కవిత తన అభిప్రాయం పంచుకున్నారు. జీవన్ రెడ్డి బలమైన నాయకుడని, ప్రజలకు ఎల్లవేళ్లలా అందుబాటులో ఉంటారని చెప్పారు. ఇంత బలమైన నాయకుడిని సస్పెండ్ చేసేందుకు కాంగ్రెస్ సాహసం చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో జీవన్ రెడ్డిని జగిత్యాలలో ఓడించేందుకు ఎంతో కష్ట పడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడుతారని తాను అనుకోవడం లేదన్నారు.





Leave a Reply