2026 డిసెంబర్ నుంచి క్వాంటం కంప్యూటర్ కార్యకలాపాలు
సీఎం చంద్రబాబు నాయుడు
(అమరావతి, న్యూస్ఇన్)
క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ తో ప్రపంచ టెక్ మ్యాప్ లోకి అమరావతి అడుగుపెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఐటీ కంపెనీలతో అమెరికా సిలికాన్ వ్యాలీగా మారితే ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంతో అమరావతి క్వాంటం వ్యాలీగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి అమరావతి క్వాంటం వ్యాలీ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రాజధానిలోని ఉద్దండ రాయుని పాలెం వద్ద సీఆర్డీఏ కేటాయించిన 50 ఎకరాల భూమిలో క్వాంటం వ్యాలీ టవర్స్ నిర్మితం కానున్నాయి. దేశంలో తొలి 133 క్యూబిట్ క్వాంటం సిస్టమ్స్ 2 తోకూడిన అమరావతి క్యాంటం కంప్యూటర్ సెంటర్ ను ను ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు ఏర్పాటు చేయనున్నాయి. క్వాంటం కంప్యూటింగ్ సహా, కమ్యూనికేషన్స్, క్వాంటం సెన్సార్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ తదితర రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ మారనుంది. క్వాంటం కంప్యూటర్ భవనాల శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ”అమరావతి, ఆంధ్రప్రదేశ్ తో పాటు భారత్ కు కూడా ఇదో చారిత్రాత్మక రోజు. క్వాంటం వ్యాలీ భవనాలతో పాటు గ్లోబల్ క్వాంటం రివల్యూషన్ లో భాగమైన నిపుణుల తయారీకి కూడా ఇది పునాది. ఐక్య రాజ్యసమితి కూడా ఈ ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించింది.

ఇది క్వాంటం ట్రాన్సిషన్ మూమెంట్ గా ఇది నిలిచిపోతుందని భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక సామర్ధ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో క్వాంటం టెక్నాలజీ ఓ కీలకమైన ముందడుగు. వ్యవసాయ, పారిశ్రామిక విప్లవాన్ని భారత్ అందిపుచ్చుకోలేక పోయింది. కానీ ఐటీ విప్లవంలో మనం ముందడుగు వేశాం. గతంలో హైదరాబాద్ లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి హైటెక్ సిటీ ప్రారంభించాం. అది ఓ గేమ్ చేంజర్ గా మారి ఫలితాలను ఇస్తోంది.హైటెక్ సిటీ తరహాలోనే క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మారుస్తాం. భారత్ లో ఏర్పాటు చేస్తున్న తొలి అమరావతి క్వాంటం వ్యాలీని ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను కలకాలం గుర్తించుకుంటాం. సాంకేతిక విప్లవాన్ని ఆచరించే ప్రధాని నరేంద్ర మోదీ కూడా బీఎస్ఎన్ ఎల్ 4 స్టాగ్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సాంకేతికత ద్వారా 6 జీ కమ్యూనికేషన్ కూడా సాధ్యం అవుతుంది. ఇదే తరహాలో భారత్ నుంచి వేర్వేరు ఉత్పత్తులను ప్రపంచానికి అందించాలని ఆకాంక్షిస్తున్నాను. వచ్చే 30 -40 ఏళ్లలో ఆచరణలోకి వచ్చే అంశాలపై నేనెప్పుడూ ఆలోచన చేస్తాను. దానికి అనుగుణంగానే ప్రణాళికలు ఉంటాయి. టెక్నాలజీని అంది పుచ్చుకున్న దేశమే భవిష్యత్తులో అభివృద్ధి సాధిస్తుంది. క్వాంటం వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలకు కేంద్రంగా ఏపీ మారుతుందని ముఖ్యమంత్రి అన్నారు.
ఏఐ లివింగ్ ల్యాబ్……

మైక్రోసాఫ్ట్ కూడా కొన్ని పాఠశాలలను దత్తత తీసుకుని శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. ఐఎస్ బీ తరహాలోనే ఏఐ లివింగ్ ల్యాబ్ యూనివర్సిటీని ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నాం. ఏఐ, క్వాంటం ఏఐ లో కోర్సులు అందించేలా అమరావతిలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. తొలుత మేధా టవర్స్ లో దీనిని ప్రారంభించి ఆ తర్వాత అమరావతికి తరలిస్తాం. ప్రజలకు ఏఐ లాంటి సాంకేతికత ప్రయోజనం అందాలన్నదే మా ఆలోచన. ఔషదాల ఆవిష్కరణ, వ్యక్తిగత ఆరోగ్యం, వాతవరణ అంచనాలు, క్రాప్ ప్లానింగ్, వాటర్ మేనేజ్మెంట్, పంట ఉత్పత్తులు ఇలా వివిధ అంశాలను అంచనా వేసి సలహాలు అందిస్తాం.
క్వాంటంలో పెట్టుబడులకు ఒప్పందాలు....

అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఎకోసిస్టంలో భాగస్వామ్యం అయ్యేందుకు సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. తద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్, అల్గారిథమ్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, సెక్యూరిటీ, క్వాంటం సెన్సింగ్, క్వాంటం బయో ఫౌండ్రీ రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు రానున్నాయి. ఐక్యూ లీప్, ట్రై క్వాంటా ల్యాబ్స్, క్యూబిట్ ఫోర్స్, ఎస్ఆర్ఎం, క్వాంట్ ఫోకస్ ల్యాబ్స్ సహా పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి.అత్యధికంగా క్వాంటం హార్డ్వేర్ అభివృద్ధికి 6 సంస్థలతో అవగాహనా ఒప్పందం కుదిరింది. ఎంవోయూలతో రాష్ట్రం నుంచే క్వాంటం సెన్సింగ్ రంగంలో ప్రత్యేక పరిశోధనలు జరిగేందుకు ఆస్కారం ఏర్పడింది.







Leave a Reply