కుటుంబ పార్టీలపై ఆ నేతల పోరాటం
రాజకీయంగా ఇద్దరికీ పోలికలు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలుగు రాష్ట్రాల రాజకీయ వారుసులుగా ఆ ఇద్దరికీ గుర్తింపు ఉంది. ఆ ఇద్దరు మహిళా నేతల తండ్రులు ముఖ్యమంత్రులుగా ప్రజల మన్ననలు చూరగొన్నారు. తమ రాజకీయ అనుభవంతో ప్రజల్లో రాజకీయంగా చెరగని ముద్ర వేసుకున్నారు. రాజకీయాలు ఉన్నంత కాలం తమ పేర్లు గుర్తుండి పోయేలా ఆ ఇద్దరు నేతలు రాజకీయాల్లో వ్యవహరించారు. కారాణాలు ఏవైనా ఆ ఇద్దరు కీలక నేతలు కూతుళ్లు సొంత దారులను ఎంచుకున్నారు. వారసత్వంగా తమ కుటుంబ సభ్యుల రాజకీయ వేదికలపై కాకుండా ప్రత్యేకంగా వేదికలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఇద్దరు మహిళా నేతల మొదటి టార్గెట్ వారసత్వ రాజకీయాలపైనే పోరాటం….తమ తండ్రుల వారసత్వంగా తనయులు నిర్వహిస్తున్న రాజకీయపార్టీలపైనే మొదలు పెట్టారు. మొదటి ప్రాధాన్యతగా రాజకీయంగా అక్షరాలు నేర్పిన పార్టీలపై ఆ తరువాత ప్రాధన్యతగా ప్రభుత్వ వ్యవహారాలు, అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఆ ఇద్దరు మహిళా నేతలే వై.ఎస్.షర్మిల, కల్వకుంట్ల కవితలు ఇద్దరు మహిళా నేతలకు రాజకీయంగా ఎన్నో పోలికలు ఉన్నాయి. వాటిని ఒక సారి పరిశీలిద్దాము…….


ఇద్దరు కూడా రాజకీయాల్లో గుర్తింపు కోసం తమ ఇంటి పేర్లు కాకుండా రాజకీయ వారసత్వం నుంచి వస్తున్న ఇంటిపేర్లనే వాడుకుంటున్నారు. వై.ఎస్ షర్మిల తన పుట్టింటి పేరునే రాజకీయాల్లో కొనసాగిస్తోంది. ఆమె భర్త అనిల్ ఇంటి పేరు (మొరుసుపల్లి) కానీ ఎక్కడా మొరుసుపల్లి అనిల్ మాదిరిగా మొరుసుపల్లి షర్మిల గా ఇప్పటి వరకు వాడుకున్న సందర్భాలు లేవు… తెలంగాణా రాజకీయాల్లో కూడా దాదాపు అదే పరిస్థితి కల్వకుంట్ల కవిత తెలంగాణా రాజకీయాల్లో తన మార్క్ వేసుకునే ప్రయత్నాలను మొదలు పెట్టారు. కవిత తన భర్త అనిల్ ఇంటి దేవనపల్లి అని ఉన్నా దేవనపల్లి కవితగా గుర్తింపు ను ఆమె కోరుకోరు. గుర్తింపు కోసం తమ పుట్టింటి పేరును రాజకీయాల్లో ఇద్దరు నేతలు వాడుకుంటున్నారు. యాదృచ్చింగా ఇద్దరు మహిళా నేతల భర్తల పేర్లు కూడా అనిల్ గా ఉండడం విశేషం. ఈ ఇద్దరు మహిళా నేతలకు ఇద్దరు కుమారులు మాత్రమే సంతానంగా ఉన్నారు.

వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీతో విబేధించి పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో అన్నతోడుగా పార్టీ నిర్వహణలో ఎంతో సహాయం చేశారు. అన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అర్ధాంతరంగా ఆగిపోతే షర్మిల అన్న ఆలోచనలను తన సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లోకి తీసుకెళ్లారు.ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత అన్న రాజకీయంగా చెల్లిని దూరంగా ఉంచడంతో తన రాజకీయ ప్రస్థానం ఆమె మొదలు పెట్టారు. తెలంగాణాలో రాజకీయం చేయాలన్న లక్ష్యంగా తన తండ్రి పేరు కలిసి వచ్చే లా వైఎస్ ఆర్ తెలంగాణా పార్టీగా పార్టీ ఏర్పాటు చేసి కొన్ని నెలల పాటు 2023 ఎన్నికలకు ముందు తెలంగాణా రాజకీయం చేసే ప్రయత్నాలు చేశారు. పార్టీ విస్తరణ కోసం జిల్లాల వారిగా కమిటీలు, నేతలను ఏర్పాటు చేసుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆమె తన నిర్ణయాన్ని మార్చకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చేరువై తెలంగాణాలో తన రాజకీయ కార్యకలాపాలను నిలిపివేసి ఏపీ లో రాజకీయాల్లో కీలకంగా మారాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో ఏర్పడిన సన్నిహిత సంబంధాలతో ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీ లో కీలక నేతగా మారారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరించి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని ముందుండి నడిపించినా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత జిల్లా లోని కడప పార్లమెంట్ ఎంపీగా పోటీ చేశారు. ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు…. ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న ఆమె అన్న జగన్మోహన్ రెడ్డిని విమర్శించేందుకు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినా…. .క్షేత్ర స్థాయి పర్యటనలు చేసినా ఇప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికార పార్టీ కంటే అన్న పార్టీపైనే షర్మిలా ఎక్కువగా విమర్శలు చేస్తారనేది నిజం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపు ఇదే పరిస్థితి కనిపించడంతో ఆ ప్రభావం వైఎస్ జగన్ పార్టీపై పడిందన్న చర్చ రాకీయంగా ఉంది. ప్రతిపక్ష పార్టీని ఎదుర్కొనేందుకు రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నా….. షర్మిల చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేది ఎలా అన్నది వైసీపీని వేధిస్తున్న అసలు సమస్యగా మారింది.

కవిత విషయానికి వస్తే తెలంగాణా ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో అమెరికాలో స్థిరపడిన ఆమె ఉద్యమ ప్రభావంతో తెలంగాణాకు మకాం మర్చారు. ఉద్యమసమయం నుంచి తెలంగాణా సంస్కృతి, చరిత్రను అవపోసాన బట్టారు. తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్బావం తరువాత పార్టీ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వడంతో తన స్వగ్రామం ఉండే పార్లమెంట్ నియోజకవర్గమైన నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఐదేళ్లలో ఎంపీగా, కేసిఆర్ కూతురుగా గులాబీ పార్టీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసిన ఆమె అనూహ్యంగా బీజేపీ ఎంపీ అభ్యర్థిలో ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత కూడా గులాబీ పార్టీ అదికారంలో నే ఉండడంతో మరోసారి నిజామాబాద్ మండలి స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. శాసనమండలికి అవకాశం పార్టీ కల్పించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పాత్ర అని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెను అరెస్టు చేశాయి. దాదాపు 7 నెలలు పాటు ఆమె జైలు జీవితం గడుపాల్సి వచ్చింది. ఆ తరువాత బేయిల్ దక్కడంతో ఆమె జైలునుంచి విడుదలై విచారణను ఎదుర్కొంటున్నారు. ఆమెను ఈ.డీ అరెస్టు చేసిన సమయంలో పార్టీ మొత్తం ఆమెకు అండగా నిలిచింది. రాజకీయంగా బీఆర్ ఎస్ ను ఎదుర్కోలేక కవితను అక్రమంగా అరెస్టు చేశారన్నా వాదనలను గులాబీ పార్టీ వినిపించింది. కవిత తండ్రి పార్టీ అధినేత స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడంతో….పార్టీ నేతలంతా ఇదే లైన్ లో రాజకీయంగా బీజెపీపై విమర్శలు గుప్పించారు.
కవిత జైలు జీవితం పూర్తయిన తరువాత అసలు రాజకీయం మొదలైంది. బీఆర్ ఎస్ పార్టీతో దూరం పెరుగుతూ వచ్చింది. పార్టీలో అధినేతను తప్పుదోవ పట్టించే విధంగా కొంత మంది వ్యవహరిస్తున్నారని కవిత గళం విప్పింది. ఒకటి రెండు సార్లు పట్టించుకోని పార్టీ అధినేత కేసిఆర్ హరీష్ రావ్ పై చేసిన ఘాటైన విమర్శలతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.దీంతో తాను ఏర్పాటు చేసుకున్న తెలంగాణా జాగృతి సంస్థ తరపున ముమ్మర కార్యక్రమాలు మొదలు పెట్టి రాజకీయంగా రాష్ట్రంలో బలపడే దిశగా అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణా జాగృతి వేదికపైనే ఉన్నా….రాజకీయ పార్టీ ని ప్రకటించడం లాంఛనమే. ఇక బీఆర్ ఎస్ సస్పెన్షన్ తో రాజకీయంగా తన గుర్తింపు కోసం కవిత కొత్త వ్యూహాలను అమలు చేయడం మొదలు పెట్టారు.
బీఆర్ ఎస్సే ప్రధాన టార్గెట్…..

ఈ వ్యూహంలో భాగంగానే ప్రతిపక్ష పార్టీ పదేళ్ల పాలన, బీఆర్ ఎస్ నిర్ణయాలను ప్రధానంగా తప్పుబడుతున్నారు. కీలక అంశాల్లో బీఆర్ ఎస్ విధానాలను తప్పుబడుతుండంతో బీఆర్ ఎస్ కు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడంలో ఇబ్బంది లేదని బీఆర్ ఎస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా…కవిత చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ ఎస్ కు నష్టం చేసేవిలా ఉన్నాయన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. కవిత విమర్శలపై గులాబీ నేతలు కూడా ఘాటుగా స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు…దీనికి కారణం కూడా ఉంది భవిష్యత్తులో కుటంబ సభ్యులు ఒక్కటైతే తమకు రాజకీయంగా ప్రాధాన్యత లేకుండా పోతుందని బీఆర్ ఎస్ నేతలు ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టే విధంగా గులాబీ నేతలు కవిత గురించి ఎక్కడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపించడం లేదు

ఈ ఇద్దరు కూడా స్వతహాగా విమర్శలు చేయడం లేదన్న ప్రచారం ఉంది. ఇద్దరు కీలక నేతల వెనుక నడిపిస్తున్న రాజకీయ శక్తులపైనే జోరుగా చర్చలు ఉన్నాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆమె కాంగ్రెస్ నేతగా మారిపోయారు. కవిత సొంత పార్టీ ఏర్పాటు తరువాత అనుసరించే వ్యూహాలే ఆమె రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. రాజకీయ లబ్ది కోసం కుటుంబ సభ్యులను సైతం లేక్క చేయరనేది మాత్రం ఇలాంటి సందర్భాలు స్పష్టత నిస్తున్నాయి.





Leave a Reply