NewsInn

News in a Click

దక్కన్ వుడ్స్,ట్రయల్స్ ద్వారా ఎకో టూరిజం

గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు మొదలు పెడుతున్నాం

మంత్రి కొండా సురేఖ

(హైదరాబాద్,న్యూస్ఇన్)

రాష్ట్రంలో విస్తరించి ఉన్న 7,200 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న రక్షిత వ‌న్యప్రాంతాలు, సహజసిద్ధమైన ప్రకృతి, ఈ ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలు కల్పిస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం గ్లోబల్ సమ్మిట్ లో 2047 నాటికి అటవీ,దేవాదాయ శాఖల లక్ష్యాల గురించి వివరించారు.రాష్ట్రంలో 2025-30, ఎకోటూరిజం ఫ్రేమ్ వ‌ర్కును ప్రవేశపెట్టి, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థను నోడల్ ఏజెన్సీగా నిర్ణయించడం జరిగిందన్నారు. ‘తక్కువ నిర్మాణాలు – ఎక్కువ అనుభవం” అన్న నినాదంతో పర్యావరణానికి హానీ లేకుండా సందర్శకులకు వన్యప్రదేశ అనుభవం అందించడమే ఈ స్లోగన్ ప్రధాన ఉద్దేశ్యమన్నారు.ప్రైవేటు రంగంతో కలిసి కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు, శిక్షణ, హాస్పిటాలిటీ నైపుణ్యాలు అందించడం ద్వారా ఎకోటూరిజాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళుతున్నట్టు వెల్లడించారు.రాష్ట్రంలో 13 ఎకోటూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేయగా, రామప్ప-శ్రీశైలం లాంటి వారసత్వ-ఆధ్యాత్మిక కేంద్రాలను ప్రకృతి పర్యాటకంతో అనుసంధానిస్తున్నారు. “Deccan Woods & Trails” పేరుతో రాష్ట్ర ఎకోటూరిజం బ్రాండును ప్రారంభించడం జరిగిందన్నారు.


అమ్రాబాద్ టైగర్ రిజర్వులో పులుల సంఖ్య 2024 నాటికి 36కు చేరుకున్నది. ఇది పులుల సంరక్షణలో రాష్ట్ర విజయాన్ని ప్రతిబింబిస్తోంది. త్వ‌ర‌లో గైడెడ్ ఫారెస్టు ట్రెక్కులు, ఆన్లైన్ బుకింగ్ యాప్ కూడా అందుబాటులోకి రానున్నదని చెప్పారు.ఎకోటూరిజం ద్వారా 2047 నాటికి నెట్ జీరో ల‌క్ష్యాల‌ను చేరేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆ దిశ‌గా అడుగులు వేస్తోందన్నారు.ఇక దేవాదాయ శాఖలో 12,434 దేవాలయాలు కలవు. అందులో 695 దేవాలయాలు ఆదాయము కలిగి ఉన్నవి. సుమారుగా 3,505 దేవాలయాలకు, ఆయా దేవాలయాలకు కలిగినటువంటి భూముల ద్వారా వచ్చేటువంటి ఆదాయాల ద్వారా, దేవాదాయ శాఖ ద్వారా నిర్వహించబడుతున్నాయని చెప్పారు. ఆదరణకు నోచుకోని 6,439 దేవాలయాలకు నిత్య ధూప దీప నైవేద్యం నిమిత్తం ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందజేస్తునామన్నారు.
వేద విద్యను ప్రోత్సహించడంలో భాగంగా వివిధ దేవాలయాలలో వేద, ఆగమ, సంస్కృత, శిల్ప కళాశాలలు నిర్వహిస్తున్నామని చెప్పారు.తెలంగాణ పండుగలు, ఉత్సవాలు నిర్వహించుటలో తమదైన ప్రాంతీయ శైలి కలిగినటువంటి రాష్ట్రం. ప్రజా ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. ఐదు రాష్ట్రాల భక్తులు పాల్గొనే అతి పెద్ద గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర, మేడారం అభివృద్ధికై అనేక చర్యలు చెప్పటడం జరుగుచున్నవి. శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టామన్నారు.2027లో జరిగేటువంటి గోదావరి పుష్కారాలలో పాల్గొనే భక్తుల సౌకర్యార్ధం ఇప్పటి నుండే కార్య చరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నం. వీటి పెద్ద ఎత్తున నిర్వహించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *