ఓటుకు నోటు కేసు సాక్ష్యాలు ధ్వంసం -కేటిఆర్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
నేర పరిశోధనలో కీలకంగా వ్యవహరించే ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం సీఎం రేవంత్ రెడ్డి కుట్రతోనే జరిగిందని బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రే కుట్ర చేసి సాక్ష్యాధారాలను దగ్ధం చేశారని ఆరోపించారు.

ఈ కేసు దాదాపు ముగింపు దశకు వచ్చి శిక్ష పడుతుందన్న కారణంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి హోం శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ ప్రమాదం వెనుక ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ ప్రమాదం జరిగిన తీరు పైన కేటీఆర్ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఫోరెన్సిక్ ల్యాబ్లో చలికాలం అగ్ని ప్రమాదం జరగడం, 24 గంటలు ఉద్యోగులు ఉండాల్సిన చోట ఉద్యోగులు ఎవరూ లేరని చెప్పడం, నిన్న ప్రమాదం పెద్దగా జరగలేదని చెప్పిన ప్రభుత్వం ఈరోజు మొత్తం 2015 నుంచి 10 సంవత్సరాల పాటు అనేక కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలు పూర్తిగా దగ్ధమయ్యాయని ప్రకటించడం చూస్తుంటే రేవంత్ రెడ్డి చేయించిన పనే స్పష్టం అవుతోందని కేటీఆర్ అన్నారు.

11 సంవత్సరాలుగా ఓటుకు నోటు కేసు కొనసాగుతున్నదని, అది ప్రస్తుతం చివరి దశలో ఉన్నదని, అందులో నుంచి బయటపడడానికే ఈ అగ్ని ప్రమాదం నాటకం, కుట్ర అని కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలో బీజేపీతో అంటకాగుతున్న కొంతమంది వ్యక్తుల సూచన మేరకు, ఢిల్లీ పెద్దలు ఇచ్చిన ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ ల్యాబ్ని రేవంత్ రెడ్డి తగలబెట్టించాడన్న అనుమానాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. అందుకే పూర్తిగా బిల్డింగ్లో ఉన్న సాక్ష్యాధారాలతో పాటు రికార్డులను, కంప్యూటర్లను, చివరికి సర్వర్లను నిర్విఘ్నంగా మూడున్నర గంటల పాటు దగ్ధం చేశారని కేటీఆర్ అన్నారు. మెత్తం 50 కంప్యూటర్లను, సర్వర్లను దగ్దం చేశారని ఆరోపించారు.
ఘటనపై నిష్పాక్షిక విచారణ జరగాలి….
ఈ ఘటన తో నేరగాళ్లు స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఏర్పడిందన్నఆందోళన వ్యక్తం చేశారు. నిన్న ప్రమాదంలో పెద్దగా నష్టం జరగలేదని చెప్పిన ప్రభుత్వం, ఈరోజు ఎఫ్ఐఆర్ లో మాత్రం పూర్తిగా సాక్ష్యాధారాలు ఉన్న కార్యాలయం దగ్ధమైందని… సాక్ష్యాధారాలు ఉన్న రూం దగ్ధమైందని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే కల్పించుకొని నిజానిజాలు బయటకి తీయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒక రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేసి ఈ అంశాన్ని నిగ్గు తేల్చాలన్నారు.




Leave a Reply