NewsInn

News in a Click

అగ్ని ప్రమాదం – చుట్టు ముట్టిన పొలిటికల్ పొగ

అగ్ని ప్రమాదం – చుట్టు ముట్టిన పొలిటికల్  పొగ

ఓటు నోటు ఆధారాలు ద‌గ్ధం— బీఆర్ఎస్

ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ధ్వంసం— బీజేపీ

స్పందించ‌ని -కాంగ్రెస్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో చోటు చేసుకున్న అగ్ని ప్ర‌మాదం మంట‌లు చ‌ల్లారినా…ఈ ఘ‌ట‌న‌పై రాజ‌కీయ పొగ‌లు క‌మ్ముకుంటున్నాయి. మూడు రోజుల క్రితం జ‌రిగిన ఈ ప్ర‌మాదం వెనుక ఒక్కో రాజ‌కీయా పార్టీ ఒక్కో అనుమానాన్ని వ్య‌క్తం చేస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో విమ‌ర్శ‌లు మ‌రింత ఘాటుగా ఉంటున్నాయి. నాంప‌ల్లిలో ఫోరెన్సిల్ ల్యాబ‌రెట‌రీ రాష్ట్రంలోని అన్ని కేసులను విశ్లేషిస్తూ పోలీసుల‌కు కేసు విచార‌ణ‌లో ఆధారాలు అందిస్తుంటుంది. దాదాపు 90 శాతం కేసుల్లో ఈ ల్యాబ్ అందించే రిపోర్టులే కీల‌కంగా ఉంటాయి. అందుబాటులోకి వ‌చ్చిన సాంకేతికత ఆధారంగా చోటు చేసుకుంటున్న నేరాల కు సంబంధించి కూడా ల్యాబ్ లోనే పోలీసులు అందించిన సాక్ష్యాల‌ను విశ్లేషించి నివేదిక‌ల‌ను అందించ‌డం ల్యాబోరెట‌రీ కీల‌క పాత్ర పోషిస్తుంది. ఇలాంటి లాబ‌రెట‌రీలో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ హాట్ గా మారింది.ఈ ఘ‌ట‌న‌లో జ‌రిగిన న‌ష్టంపై పోలీసులు ప్ర‌క‌ట‌న చేశారు. ఇంకా ద‌ర్యాప్తు కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించారు.కానీ ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో ల్యాబ్ అగ్ని ప్ర‌మాదం చుట్టూ రాజ‌కీయ పొగ‌లు క‌మ్ముకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కీల‌క కేసుల‌కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం కావ‌డం రాష్ట్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యంగా చెబుతూ రాజ‌కీయ పార్టీలు త‌మ దైన స్టైల్లో అధికార పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

ఈ ల్యాబ్ ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే బీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అనుమానాల‌ను వ్య‌క్తం చేశారు. ఆ త‌రువాత మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి ప్ర‌భుత్వ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి లాంటి క్రిమిన‌ల్ ముఖ్య‌మంత్రిగా ఉండ‌డంతో ఎంతో క్రిమిన‌ల్స్ సాక్ష్యాలు ఇప్పుడు పూర్తిగా ద‌గ్ధం అయ్యాయ‌ని ఆరోపించారు. స్వ‌యంగా రేవంత్ రెడ్డి ఓటుకు నోటో కేసులో ఉండ‌డం, ఈ కేసు విచార‌ణ తుది ద‌శ‌కు చేరుకోవ‌డంతో శిక్ష త‌ప్ప‌ద‌న్న అనుమానంతో రేవంత్ అగ్నిప్ర‌మాదానికి కుట్ర ప‌న్నార‌ని కేటిఆర్ ఘాటుగా విమ‌ర్శ‌లు చేశారు. ఈ ప్ర‌మాదవ‌శాత్తు చోటు చేసుకున్న ఘ‌ట‌న కానే కాద‌ని స్ప‌ష్టం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచంద‌ర్ రావ్ కూడా అగ్ని ప్ర‌మాదం పై స్పందించారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు ఒక్క‌టై ఎవ‌రికి వారు ర‌క్షించుకునే ప‌నిలో ప‌డ్డార‌న్న‌ది ఆరోప‌ణ‌. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్నో ఆధారాలు ఇక్క‌డ ఉన్నాయ‌ని ఆ కేసులో బీఆర్ఎస్ నేత‌ల‌ను కాపాడేందుకు ప్ర‌భుత్వం కుట్ర ప‌న్నింద‌ని ఆరోపించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఎన్నో నేరాల‌కు సంబంధించి వివ‌రాలు ఈ అగ్ని ప్ర‌మాదంలో ధ్వంసం కావ‌డం వెనుక భారీ కుట్ర ఉంద‌న్నారు. గ‌తంలో రేవంత్ రెడ్డిని ఓటు కు నోటు కేసులో బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం కాప‌డ‌డంతోనే ప్ర‌స్తుతం రేవంత్ బీఆర్ ఎస్ నేత‌ల‌ను కాపాడుతున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ ప్ర‌మాదం పై పూర్తి స్థాయి విచార‌ణ జ‌రుగాల‌ని డిమాండ్ చేశారు.

అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అంశంలో ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ లేదు. కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఈ అంశంపై ఎలా స్పందిస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తి రేపుతున్న అంశంగా మారింది. అయితే పోలీసులు స్టేట్ మెంట్ ను కాంగ్రెస్ నేత‌లు వివ‌రించే అవ‌కాశం ఉంది. ప్ర‌మాద వ‌శాత్తు చోటు చేసుకున్న ఘ‌ట‌న‌గానే పోలీసులు ప్ర‌క‌టించ‌డంతో ఇదే అంశాన్ని కాంగ్రెస్ నేత‌లు ప్ర‌స్తావించే చాన్స్ క‌నిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *