కేసీఆర్ ను బీజేపీ కాపాడుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దాదాపు 12 ఏళ్లుగా అధికారంలో ఉందని, రాష్ట్రంలో బీఆర్ ఎస్ పదేళ్లు అధికారంలో ఉందని మా పాలనలో జరిగిన అభివృద్ది పనులు, పాలనను బేరీజు వేసుకుని ఓట్లు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఙప్తి చేశారు. ఈ రోజు తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. అసదుద్దీన్ ఒవైసీని బూతంగా చూపి ఎంతకాలం బీజేపీ ఎంతకాలం మత రాజకీయాలు చేస్తారు? అని ప్రశ్నించారు. రాజకీయ మనుగడకోసం మత విద్వేషాలు రెచ్చగొట్టడం వాళ్ల భావదారి దారిద్యానికి నిదర్శనం అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో త్రిముఖ పోటీ జరుగుతోందని చెప్పారు.బీజేపీ జాతీయ నేతలు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని తెలంగాణా ప్రజలను అవమానించి ఓట్లు వేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపి హామీలను నమ్మి మూడో వంతు స్థానాలు అందిస్తే….ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆరోపించారు. కేంద్రం నుంచి ఏ మంత్రి వచ్చినా లక్షల కోట్లు మంజూరు చేశామని చెబుతున్నారు. తెలంగాణా నుంచి కేంద్రానికి అందుతున్న పన్నుల గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు.

తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించిన వాటానే రాష్ట్రానికి ఇస్తున్నారన్నారు. దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ చిన్న చూపు చూస్తోందన్నారు. కేంద్రం చూపిస్తున్న వివక్షను కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఎప్పుడైనా కేంద్రం ను ప్రశ్నించారా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు గత 12 ఏళ్లుగా ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా తేలకపోయారన్నారు. ఓట్లు వేయించుకోవడం.. సీట్లు తెచ్చుకోవడం తప్ప బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేం లేదని ఆరోపించారు. తెలంగాణా ప్రజల కోసం అవసరం అయితే ప్రధాని మోడీని కలుస్తానని, అవసరమైతే ఫైట్ చేస్తానన్నారు.
కేసిఆర్,కేటిఆర్ ల అరెస్టు కాకుండా బీజేపీ కాపాడుతోంది…..
ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే పదేళ్ల పాటు సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు అన్ని పదవులు ఆ పార్టీ అనుభవించినా…. ప్రస్తుత సమస్యలకు ఆ పార్టీ అనుసరించిన విధానాలే కారణమన్నారు. ఏ ముఖం పెట్టుకుని బీఆర్ ఎస్ నేడు ఓట్లు అడుగుతుందన్నారు. ఒక ఉన్మాదంతో మానసిక రోగంతో టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా వందల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. నోట్ల రద్దు, రైతు వ్యతిరేక నల్లచట్టాలు, త్రిపుల్ తలాక్ కు బీఆర్ ఎస్ మద్దతు నిచ్చిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు.2023 వరకు ఇద్దరిదీ ఫెవికాల్ బంధం అని ఆరోపించారు.ఈ కారణంగానే కేసిఆర్, కేటిఆర్, హరీష్ రావులను అరెస్టు కాకుండా ప్రస్తుతం బీజేపీ కాపాడుతోందన్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ ఎస్ మొక్కను మొలవనివ్వనని మరోసారి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసామని చెప్పారు.






Leave a Reply