NewsInn

News in a Click

మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చార ప‌ర్వం పూర్తి

  • ఓట‌ర్లు ఎవ‌రివైపో
  • ఎవ‌రి వాద‌న‌లు వారివే

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో అన్ని మున్సిపాల్టీలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ప్ర‌చార ప‌ర్వం ముగిసింది. అతి త‌క్క‌వ స‌మ‌యం మాత్ర‌మే నోటిఫికేష‌న్ వెలువ‌డ‌డంతో రాజ‌కీయ పార్టీలు త‌మ అస్త్రాల‌ను అన్నీ వారం రోజుల్లోనే ప్ర‌యోగించాయి. రాష్ట్రంలో ప్ర‌జాపాల‌న పేరుతోసీఎం రేవంత్ రెడ్డి ప‌లు జిల్లాల్లో మున్సిప‌ల్ ఎన్నిక‌లను దృష్టిలో ఉంచుకుని ప‌ర్య‌టించారు. గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలోనే స‌భ‌లు ఏర్పాటు చేసినా…… స‌మీపంలో ఉన్న మున్సిపాల్టీల అభ్య‌ర్థులు, ప్ర‌జ‌ల‌ను ఆయా స‌భ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ త‌ర‌లించింది. గ‌త నాలుగైదు రోజులుగా సీఎం ప‌లు జిల్లాల్లో మున్పిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌చారం చేప‌ట్టారు.ఈ సంద‌ర్భంగా బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీల పై ప్ర‌తి స‌భ‌లోనే ఎండ‌గ‌డుతూ వ‌చ్చారు.

ప్ర‌తిప‌క్ష పార్టీల విష‌యానికి వ‌స్తే బీజేపీ కూడా మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఫోక‌స్ పెట్టింది. ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌లంతా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్. రాంచంద‌ర్ రావ్ స‌హా ఎంపీలు తాము ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం నిర్వ‌హించారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షులు నితిన్ న‌బీన్ కూడా పాల‌మూరు ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎన్నిక‌ల స‌భ‌లో మ‌హారాష్ట్ర సీఎం దేవంద్ర ఫ‌డ్నవీస్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు బండి సంజ‌య్, కిష‌న్ రెడ్డిలు ప‌లు మున్సిపాల్టీలో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు. బీజేపీ బీఆర్ ఎస్, కాంగ్రెస్ ఒక్క‌టే అన్న ప్ర‌చారాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ప్రాధాన్య‌త ఇచ్చింది. అవ‌గాహ‌న‌తోనే తెలంగాణాలో ఆ పార్టీలు రాజకీయం చేస్తున్నాయ‌ని ఆరోప‌ణ‌లు చేసింది.సేవ్ తెలంగాణా పేరుతో సోష‌ల్ మీడియాలో క్యాంపేయిన్ చేసింది.

బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఎన్నిక‌ల స‌భ‌లు మొద‌ట్లో ఒక‌టి రెండుతో మొద‌లు పెట్టినా…చివ‌రి నాటికి రోజుకు మూడు నాలుగు మున్సిపాల్టీల్లో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు. పార్టీ మ‌రో కీల‌క నేత హ‌రీష్ రావ్ ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాతో పాటు స‌మీప మున్సిపాల్టీల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు. ఈ సంద‌ర్బంగా ఈ ఇద్ద‌రు నేత‌లు కూడా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు. బీజేపీని బీఆర్ ఎస్ పెద్ద‌గా టార్గెట్ చేయ‌క‌పోవ‌యినా… బీజేపీకి అనుబంధంగానే రేవంత్ రెడ్డి ప‌నిచేస్తున్నార‌న్న వాద‌న‌ను బీఆర్ ఎస్ వినిపించింది.

ఎంఐఎం పార్టీ కూడా త‌మ‌కు ప‌ట్టున్న ప్రాంతాల్లో ఎమ్మెల్యేల‌ను ఇంచార్జ్ లుగా నియ‌మించి ప్ర‌చారం చేసింది. పోటీ చేసిన‌ప్ప‌టి నుంచి వ్యూహాత్మ‌కంగానే ఎంఐఎం పావులు క‌దుపుతూ వ‌చ్చింది.

స్వ‌త‌హాగా అధికార పార్టీతో స‌న్నిహితంగా ఉంటుంద‌ని పేరున్నా…ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వైఫ‌ల్యాల‌ను ఎత్తి చూపింది. ఆ పార్టీ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ బీఆర్ ఎస్ ను టార్గెట్ చేయ‌గా…. శాస‌న‌స‌భా ప‌క్ష నేత కాంగ్రెస్ ను విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు అక్బరుద్దీన్ శ్రీ 420 సినిమాలో మాదిరిగా అన్నీ అబ‌ద్ధాలు చెప్పి ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌న్నారు. తెలంగాణా జాగృతి పేరుతో రాజ‌కీయాలు మొదలు పెట్టిన క‌విత ఫార్వ‌ర్డ్ బ్లాక్ పార్టీతో ఒప్పందం చేసుకుని ప‌లు జిల్లాల్లో త‌మ అభ్యుర్థుల‌ను రంగంలోకి దించింది. ఎన్నిక‌ల ప్ర‌చారానికి ప్ర‌త్యేకంగా వెళ్ల‌క‌పోయినా… బీఆర్ ఎస్ ను ఇరుకున పెట్టే విధంగా ఆమె పావులు క‌దిపింది. అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ వైఫ‌ల్యాల‌ను పెద్ద‌గా ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.అన్ని రాజ‌కీయ పార్టీలు ప్ర‌చార ప‌ర్వం పూర్తి చేసుకోవ‌డంతో ఇక పై పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి సారించ‌నున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *