NewsInn

News in a Click

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కొత్త హెల్త్ స్కీం…!

ఈ నెలాఖ‌రుకు ప్రారంభం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాలని ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం నిర్ణయించింది. సచివాలయంలో నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు అధ్యక్షతన పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ఉద్యోగుల నూతన హెల్త్ స్కీమ్ కు ఉద్యోగుల తరపున తమ బేసిక్ సాలరీలో 1.5 శాతం మొత్తాన్ని, ప్రభుత్వం తరపున కూడా 1.5 శాతం కేటాయించాలన్న ప్రతిపాదనను ఈ సమావేశంలో అంగీకరించారు. ఈ హెల్త్ స్కీమ్ కు సంబంధించిన మార్గదర్శకాలను మరికొద్ది రోజుల్లో ఖరారు చేసి, ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంతి, ఉప ముఖ్యమంత్రి లచే ప్రకటింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు ఉద్యోగ సంఘాల నాయకులకు సూచించారు.

నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం వివరాలను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో లక్షా 44 వేల మంది పెన్షనర్లు, రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా, 12.84 లక్షల మంది డిపెండెంట్లు ఉన్నారని తెలిపారు. ఈ ఉద్యోగులు, పెన్షనర్లలో నాలుగవ తరగతి ఉద్యోగులు, నాన్ గెజిటెడ్, గెజిటెడ్, పెన్షనర్లు తమ బేసిక్-పే లో 1.5 శాతం మొత్తాన్ని చెల్లిస్తే సంవత్సరానికి రూ. 528 కోట్లు జమ అవుతాయని, అంతే మొత్తాన్ని ప్రభుత్వం తన వాటాగా ఇస్తుందని పేర్కొన్నారు. ఈ ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ లో ఉద్యోగ సంఘాల నుండి ఆరుగురు ప్రతినిధులు, పెన్షనర్ల నుండి ఇద్దరు సభ్యులుంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులనుండి ఒకరిని ఈ ట్రస్టు సి.ఈ.ఓ గా నియమిస్తారు.


ఉద్యోగులకు ఉత్తమమైన వైద్య సదుపాయాలను అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని, ప్రస్తుతం ప్రతిపాదించిన నూతన హెల్త్ స్కీమ్ ఒక ముందడుగు అని సి.ఎస్ అన్నారు. రానున్న కాలంలో ఈ పథకంలో మార్పులు, చేర్పులపై ట్రస్ట్ సమావేశంలో నిర్ణయిస్తారని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించిన మార్గ దర్శకాలను రూపొందించనున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *