విపక్ష నేతగా పట్టు నిలుపుకున్న మాజీ మంత్రి
(మెదక్,న్యూస్ఇన్)
ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావ్ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా….ప్రతిపక్షంలో ఉన్నా ఉమ్మడి మెదక్ జిల్లాలో తనకు రాజకీయంగా ఎవరూ పోటీ పడలేరనే విధంగా ఫలితాల ద్వరా నిరూపించుకున్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని జిల్లాల్లో కూడా సత్తా చాటగా మెదక్ జిల్లాలో మాత్రం తడబడింది. మెజార్టీ మున్సిపాల్టీలు కాంగ్రెస్ ఖాతాలో పడకుండా హరీష్ రాజకీయంగా పావులు కదిపారు.

తాను ప్రాతినిథ్యం వహించే సిద్దిపేట నియోజకవర్గం నుంచే విజయాన్ని పార్టీకి అందించేలా చక్రం తిప్పారు. అతి తక్కువ సమయంలోనే జిల్లాలోని అన్ని మున్సిపాల్టీలో ప్రచార బాధ్యతలు నిర్వహిస్తూ…స్థానిక నేతలను సమన్వయం చేస్తూ పార్టీకి సానుకూల ఫలితాలు తేవడంలో కీలక పాత్ర పోషించారు. మాజీ సీఎం కేసిఆర్ ప్రాతినిథ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గంలో కూడా హరీష్ రావ్ సూచనలతోనే స్థానిక నేతలు ఎన్నికలను ఎదుర్కొన్నారు. సంగారెడ్డి, ఆందోళ్, జహీరాబాద్, నర్సాపూర్ నియోజకవర్గాల్ని మున్సిపాల్టీలు మినహా అన్ని చోట్ల బీఆర్ ఎస్ అభ్యర్థుల విజయం కోసం హరీష్ ప్రణాళికలు వేసి ఫలితాలను రాబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రెండ్ కొనసాగితే…మెదక్ జిల్లాలో హరీష్ ట్రెండ్ కనిపించేలా అమలు చేసిన ప్లాన్ విజయవంతం అయింది. జిల్లాలోని 19 మున్సిపల్ పట్టణాల్లో 11 స్థానాలను బీఆర్ఎస్ ఏకపక్షంగా కైవసం చేసుకుంది.

మరో స్థానం కూడా కారు పార్టీ పాగా వేసే అవకాశం కనిపిస్తోంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పఠాన్ చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాల్టీలను బీఆర్ ఎస్ తమ ఖాతాలోనే వేసుకుంది. ప్రచారానికి కేవలం ఆరు రోజుల సమయం మాత్రమే ఉండడంతో సుడిగాలి పర్యటనలు ఆయన చేశారు. ఆరు రోజుల్లో 40 చోట్ల సభలు, కార్నర్ మీటింగ్ లు, రోడ్ షోల ద్వారా పార్టీ ప్రచారన్ని నిర్వహించారు. ఓటర్లకు చేరువయ్యేందుకు రచ్చబండ, చర్చా వేదికల పేరుతో మహిళల వద్దకు ప్రచారం కోసం వెళ్లారు. కేసిఆర్ ఇచ్చిన ఆదేశాలతో ఉమ్మడి జిల్లాల్లో అన్నీ తానై వ్యవహరించి హరీష్ రావ్ మరోసారి తన మార్క్ వేసుకున్నారు.
జిల్లాలో మున్సిపాల్టీల వారిగా గులాబీ పార్టీ స్థానాలు..

ప్రజా వ్యతిరేక పాలనకు నిలువుటద్దం ఫలితాలు..హరీష్ రావ్
ముఖ్యమంత్రి, మంత్రులు సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటై కొట్లాడినా మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారని హరీష్ రావ్ మున్సిపల్ ఫలితాలపైతన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగం, డబ్బు రాజకీయాలు, బెదిరింపులు అన్నింటినీ తట్టుకుని గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టన్నారు. దాదాపు 700 పైగా వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు సాధించడం యాదృచ్ఛికం కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ పెరుగుతున్న ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో గులాబీ జెండా ఎగురేసేందుకు నిర్విరామ పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఎన్నికల్లో తమను ఆదరించిన ఓటర్లకు, పార్టీ గెలుపుకు కృషి చేసిన నేతలకు అభినందనలు తెలిపారు.





Leave a Reply