కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ప్రాధాన్యత

(నల్గొండ,న్యూస్ఇన్)
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంత్రి పదవి పై కలలు కంటూనే ఉన్నారు. మంత్రి వర్గ విస్తరణ ఊహాగానాలు వచ్చినప్పుడు…ఎలాంటి ఊహాగానాలు లేప్పుడు కూడా తాను మంత్రి వర్గం రేస్ లో ఉన్నానని ఆయనే ప్రకటించుకోవడం ఇప్పటి వరకు మనం వింటూ వస్తున్నాం…. ప్రభుత్వం ఏర్పాటైన 27 నెలలో రెండు సార్లు మంత్రి వర్గం విస్తరించినా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. కానీ ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకే కుటుంబంలో ఇద్దరికీ మంత్రి పదవి ఇవ్వడంపైనే కాంగ్రెస్ పార్టీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కోమటి రెడ్డి కుటుంబానికి మరో స్థానం మంత్రివర్గంలో కేటాయిస్తే మరో ఎమ్మెల్యే వినోద్ కూడా తనకు మంత్రి వర్గంలో స్థానం కోసం పట్టుబట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఏం తప్పుచేసిందని ఉత్తమ్ వర్గం నేతలు తమ నేతకు ఎందుకు ఇవ్వరనే వాదనను తెరపైకి తెస్తున్నారు.

ఈ నేపథ్యంలో అవకాశం వచ్చిన ప్రతి సమయంలో మంత్రి ని అవుతానంటూ చెప్పుకునే రాజగోపాల్ రెడ్డి ఈ సారి మరో అడుగు ముందుకు వేశారు. త్వరలో మంత్రిని అవుతా….లేదంటే ముఖ్యమంత్రినే అవుతా అనే వ్యాఖ్యలు చేశారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణా మొత్తం చూసుకునే పరిస్థితి వస్తుందని, మునుగోడును స్థానిక నేతలు చూసుకోవాలని సూచించారు. ఎన్నికలకు ముందు తాను కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవి ఇవ్వడం లేదేంటే నేనే ఆ పదవిని లాక్కుంటా అని వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత రెండు రోజులుగా ఢిల్లీలో పర్యటించిన సమయంలో ఏఐసీసీ కీలక నేతలతో మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణకు సంబంధించి ఏమైనా చర్చలు జరిపినట్లు సమాచారం రాజగోపాల్ రెడ్డికి ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం ఢిల్లీ టూర్ పూర్తయిన సమయంలోనే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా హాట్ హాట్ గా మారాయి. అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ జడ్పీ, మండల ఎన్నికల నిర్వహించే అవకాశం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే మరో ఎన్నికలు జరుపాల్సి ఉంటే క్యాబినెట్ విస్తరణ ఆ ఎన్నికలే తరువాత ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.





Leave a Reply