NewsInn

News in a Click

నీట్, ఐఐటీల్లో ఎస్టీ విద్యార్థులు సీట్లు సాధించాలి

నీట్, ఐఐటీల్లో ఎస్టీ విద్యార్థులు సీట్లు సాధించాలి

సేవాలాల్ స్ఫూర్తితో ఆదివాసీల అభివృద్ధి

ముఖ్యమంత్రి చంద్రబాబు

(అమరావతి, న్యూస్ఇన్‌)

నీట్, ఐఐటిల్లో సీట్లు సాధించేలా గురుకులాల్లో ఎస్టీ విద్యార్థులకు శిక్షణ అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లోని విద్యార్థులు చదువుల్లో ముందుంటున్నారని, ఉన్నత కొలువులు సాధించాలనే పట్టుదల వారిలో పెరిగిందన్నారు. భవిష్యత్‌లో ఉన్నత స్థానానికి చేరుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదని అభిప్రాయపడ్డారు. సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. రూ.50 లక్షలు కేటాయించి సేవాలాల్ మహరాజ్ జయంతిని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ప్రసంగించారు.

దేశమంతా తిరిగి బంజారాలాను ఒకతాటిపైకి తీసుకొచ్చారు. సేవాలాల్ సేవలను ఆయన మన రాష్ట్రంలో జన్మించడం మన అదృష్టం. చిన్నతనం నుంచే సేవాలాల్ సామాజిక సేవతో మెలిగారు. ఎవరైనా ఆకలితో ఉంటే ఆయన త‌న‌ ఆహారాన్ని పక్కవారికి ఇచ్చి ఆకలి తీర్చిన గొప్ప వ్యక్తి. జంతుబలిని వ్యతిరేకించారు. జంతువులను బలివ్వాలనుంటే ముందు నన్ను బలి ఇవ్వండని చెప్పిన వ్య‌క్తి ఆయ‌న అని బాబు ఆయ‌న మాట‌ల‌ను గుర్తు చేశారు.

గిరిజన ప్రాంతాల్లో వనరులకు కొదవలేదు..వాటిని సద్వివినియోగం చేసుకోవాలి. ఆదివాసీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసుతలు కల్పిస్తున్నాం. ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తున్నాం. 2026-27 వార్షిక బడ్జెట్‌లో రూ.9,190 కోట్లు ఎస్టీల కోసం కేటాయించాం. సంత్ శ్రీ సేవాలాల్ లాంటి మహనీయుణ్ని నిత్యం తలచుకుని సమాజ హితం కోసం ప్రతి ఒక్కరం పని చేయాలి’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా గిరిజ‌న మ‌హిలా ఎమ్మెల్యేలు చంద్ర‌బాబును ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *