NewsInn

News in a Click

జనసేన – సభ్యత్వ నమోదు ప్రారంభం….!

  • అధినేత స‌భ్య‌త్వం ఖ‌రీదు రూ.2 కోట్లు

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో జ‌న‌సేన సభ్య‌త్వ న‌మోదును ప్ర‌క్రియ‌ను మొద‌లు పెట్టింది. శివ‌రాత్రి ప‌ర్వ దినం సంద‌ర్భంగా పార్టీ అధినేత క్రియాశీల‌క స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్రాన్ని పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ మంగ‌ళ‌గిరిలో ప్రారంభించారు. తొలి స‌భ్య‌త్వం తీసుకున్న ప‌వ‌న్ పార్టీ కార్య‌క‌ర్త‌ల బీమా కోసం 2 కోట్ల రుపాయాల విరాళాన్ని ప్ర‌క‌టించారు. . ఇందుకు సంబంధించిన చెక్కును పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు అందజేశారు. ఐదో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 26 నుంచి మొదలవుతుందని వెల్ల‌డించారు. పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఒక వారం ముందు నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు.గతంలో సభ్యత్వ నమోదులో అత్యధిక సభ్యత్వాలు చేసిన వారి సమక్షంలో ఆదివారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైతే పార్టీలో నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారో వారు క్షేత్రస్థాయిలో పని చేసే కార్యకర్త కష్టాన్ని గుర్తించాలి. పార్టీ ఉన్నతి కోసం ఉద్యమి, సాధక్, ప్రదాతగా మారి పనిచేయాలి. అప్పుడే వారు పార్టీలో సంపూర్ణ నాయకులుగా ఎదుగుతారు. నిబద్ధతగల నాయకత్వం చాలా అవసరం ఏ వ్యవస్థ అయినా మనుగడ సాధించాలంటే నిబద్ధత, నిజాయతీ కలిగిన నాయకత్వం చాలా అవసరం అన్నారు.జనసేన పార్టీకి వందలు, వేల మంది అవసరం లేదు. లక్షల మెదళ్లను కదిలించే వాళ్లు కావాలి. అలాంటి వాళ్లు పదిమంది ఉన్నా ఈ సమాజంలో మార్పు తీసుకురావచ్చ‌ని ప‌వ‌న్ అభిప్రాయం వ్య‌క్తం చేశారు.కులం, మతం మీదనే ముందుకు వెళ్లాలి అనుకుంటే కొంతమేరకే ప్రయోజనాలు కలుగుతాయి. దీర్ఘకాలం నిలబడాలి అంటే దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

తెలంగాణలో ముందడుగు పడింది…..

తెలంగాణ మున్సిపల్. ఎన్నికల్లో జనసేన పార్టీ నిలబడాలి, మన గళం తెలంగాణలో వినిపించాలనే ఆకాంక్షతో పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుపొందారు. అది చిన్న గెలుపే కావచ్చు. కానీ అది మార్పునకు బలమైన సంకేతం. జనసేన పార్టీ… ఆంధ్రప్రదేశ్ పార్టీ తెలంగాణలో పోటీ ఏంటని కొందరు విమర్శించినా… మన జనసైనికులే వారి మాటలను తిప్పికొట్టారు. కాంగ్రెస్ ఢిల్లీలో పుట్టలేదా? టీఆర్ఎస్ … బీఆర్ఎస్ గా మారలేదా? అని సమాధానం ఇచ్చారు. ప్రతి పార్టీ కూడా వాటి విస్తృతికి పెంచుకుంటూ వెళ్తాయి. జనసేన పార్టీ కూడా అంతే. జనసేన ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాదు. జనసేన పార్టీకి ఆయువు పట్టు యువత. వాళ్ల శక్తి అనే ఇంధనం మీదే పార్టీ నడుస్తోంది. బాధ్యతయుతమైన యువతను నాయకత్వం వైపు తీసుకెళ్లడమే నా లక్ష్యం అని ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేశారు.

90 వేలతో మొదలై… 13 లక్షలకు చేరాం….
2020లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించినప్పుడు 90 వేలు నమోదు చేశాం. ఎన్నికల ముందు ఆ సంఖ్య ఆరు లక్షలకు చేరింది. ఎన్నికల తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలు సాధించాం. అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు. కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *