
దోపీడిని అడ్డుకునేందుకు సిపిఐ కి మద్దతు ప్రకటించాము
సేవాలాల్ జయంతి వేడుకల్లో కేటీఆర్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
సింగరేణిలో జరుగుతున్న దోపిడీని అడ్డుకోవడమే తమ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా కొత్తగూడెంలో బీఆర్ఎస్ తన మద్దతు సిపిఐ కి ప్రకటించిందని ఆయన తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి సింగరేణి దోపిడీలో భాగస్వాములై సంస్థను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. సీపీఐ మరియు కాంగ్రెస్ ఇప్పటికే అలయన్స్లో ఉన్నాయని, కొత్తగూడెంలో మేయర్ పదవి పంచుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. అయితే ఏఐటీయూసీ వంటి సీపీఐకి అనుబంధ సంస్థ కూడా ఈ పొత్తును ఎందుకు అంగీకరించిందో తెలియదన్నారు. దాని వెనుక ఏ ఒత్తిళ్లు పని చేశాయో తాను చెప్పలేనని వ్యాఖ్యానించారు. అయితే ఎవరు కలిసి వచ్చినా, కలిసి రాకపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాలు, కార్మికుల హక్కుల కోసం గతంలో ఎట్లా పోరాడామో భవిష్యత్తులో కూడా అలాగే పోరాడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.

మున్సిపల్ హంగ్ పరిస్థితులపై…..
రాష్ట్రంలో దాదాపు 34 చోట్ల హంగ్ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను శిబిరాలకు, ప్రలోభపెట్టడం, పోలీసులను ఇంటింటికి పంపించడం, గుండాలను ఉపయోగించడం వంటి చర్యలు జరుగుతున్నాయని అన్నారు.
జల్ – జంగల్ – జమీన్ స్ఫూర్తితో కెసిఆర్ పాలన…….
కొమురం భీమ్ నాయకత్వంలో జరిగిన జల్, జంగల్, జమీన్ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ అడవులు, భూములు, నీళ్ల విషయంలో న్యాయం చేస్తూ గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచామని కేటీఆర్ తెలిపారు. గిరిజన పిల్లల కోసం ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ మరియు డిగ్రీ కాలేజీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం బిఆర్ఎస్ ప్రభుత్వ ఘనత అని చెప్పారు. తెలంగాణా భవన్ లో జరిగిన సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో కేటిఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ “మా తండాల్లో మా రాజ్యం ఉండాలి” అన్న నినాదాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చి గిరిజనుల ఆత్మగౌరవానికి న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు.కోయ గూడాలు, లంబాడా తండాలకు ప్రాధాన్యం ఇస్తూ 3,146 కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసి వేలాది గిరిజన యువతకు సర్పంచ్లు, వార్డు సభ్యులుగా అవకాశాలు కల్పించారని చెప్పారు. దాదాపు 30 వేల మంది వార్డు సభ్యులు గిరిజన వర్గాల నుంచి ఎదిగారని వివరించారు. అలాగే ఒకే రోజు సుమారు నాలుగున్నర లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనుల భూమి హక్కులను రక్షించిందీ బిఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు.







Leave a Reply