NewsInn

News in a Click

వ్య‌వ‌సాయ‌ క్షేత్రాన్ని సందర్శించిన బిల్ గేట్స్

సాగులో యాప్, డ్రోన్ల వినియోగం పరిశీలన

(అమరావతి, న్యూస్ఇన్‌)

వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాంకేతిక వినియోగం, ఏఐ ఆధారిత రైతు సేవలను గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఉండవల్లి కరకట్ట సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని సోమవారం సందర్శించిన గేట్స్‌కు రైతుల్లో సాంకేతిక వినియోగాన్ని పెంచే కార్యక్రమాలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు వివరించారు. వ్యవసాయం-అనుబంధ రంగాల్లో దిగుబడి పెంపు, సాగు ఖర్చు తగ్గింపుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలిపారు. అలాగే నాణ్యమైన పంట ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక కార్యాచరణ అవలంభించి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు రైతు సేవా కేంద్రాల్లో అనలిటిక్స్, మానిటరింగ్ డాష్‌బోర్డులు వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మణి, అన్నపూర్ణ… ఇటీవల ముఖ్యమంత్రి ప్రారంభించిన ఏపీఏఐఎంఎస్ రైతు యాప్‌ గురించి గేట్స్‌కు తెలియజేశారు. ఈ యాప్ ద్వారా ఏ పంటలు పండించాలి, సాగునీటి నిర్వహణ, నేల స్వభావం, ధరలు, మార్కెట్ సమాచారం, పురుగు మందుల నియంత్రణ వంటి విషయాలు సులభంగా తెలుసుకుంటున్నామని చెప్పారు.

ఏఐ ద్వారా పంట తెగుళ్ల గుర్తింపు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే డ్రోన్ సేవలు పొంది పురుగు మందులను వినియోగిస్తున్న తీరును తెలిపారు. బిల్ గేట్స్ సమక్షంలోనే రైతులు ఏఐ టూల్ ఉపయోగించి, వ్యాధి సోకిన మొక్క ఫోటో తీసి అప్లోడ్ చేశారు. ఆ వ్యాధిని ఏఐ గుర్తించి నివారణ సూచనలు అందించింది. అనంతరం డ్రోన్ సేవను బుక్ చేయగా, మొక్కకు వ్యాధి వ్యాపించిన చోట డ్రోన్ స్ప్రే చేసింది. ఇది స్వయంగా చూసిన బిల్ గేట్స్… రైతులకు ఏఐ-అగ్రి టెక్ సేవలు అత్యద్భుతంగా అందిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *