
నాలుగు వారాల్లో సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని ఆదేశం
(న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
సినీ ప్రపంచలనంలో కలకలం రేపిన నటి ప్రత్యూష మృతి రెండు దశాబ్దాల క్రితం సంచలనం రేపింది. ఎన్నో మలుపులు తిరిగింది. ఎంతో మంది ప్రముఖుల పేర్లు ఈ కేసులో వినిపించాయి. ఈ కేసు చుట్టూ రోజుకో చర్చ తెరపైకి వచ్చింది. ప్రత్యూష తల్లి సరోజినీ దేవి సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత ఈ రోజు కేసులో మరో కీలక నిర్ణయం వచ్చింది.దాదాపు 24 ఏండ్ల తర్వాత ఈ తీర్పు వెలువడడం విశేషం.
నటి ప్రత్యూష 2002 ఫిబ్రవరి 24 న లనుమానస్పద స్థితిలో మృతిచెందారు. ప్రియుడు సిద్ధార్థ రెడ్డితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతిచెందగా ప్రియుడు సిద్ధార్థ రెడ్డి కోలుకున్నారు. తొలుత ఇది ఆత్మహత్యాయత్నమంటూ ప్రచారం జరిగినా ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోస్టుమార్టం నివేదికలో ఆమె మెడ ఎముక విరిగిందని, శరీరంపై కొన్ని గాయాలు ఉన్నాయని తేలడం ఈ అనుమానాలకు బలం చేకూర్చినట్లయింది. దీని వెనుక రాజకీయ నాయకుల వారసులు ఉన్నారనే చర్చ అప్పట్లో జోరుగా జరిగింది.

ప్రత్యూష ఆత్మహత్య చేసుకుని చనిపోలేదని, హత్య అని తల్లి సరోజినిదేవి ఆ రోజు నుంచి ఆదే వాదనను వినిపిస్తున్నారు. పోలీసులు ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేసినా ప్రజాసంఘాల ఒత్తిడితో పాటు తల్లి ఆరోపణలతో కోర్టుల్లో విచారణ జరిగింది. ప్రియుడు సిద్ధార్ధను పెళ్లి చేసుకోవాలని భావించినా పెద్దలు అంగీకరించలేదనే కారణంతో ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు. సిటీ సివిల్ కోర్టు 2004లో సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో ఆ శిక్ష రెండేళ్లకు తగ్గింది. శిక్ష తగ్గించడాన్ని సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజిని దేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శిక్షను పూర్తిగా కొట్టివేయాలంటూ సిద్ధార్థ రెడ్డి కూడా సుప్రీంకోర్టును కోరారు. ఈ కేసును పరిశీలించిన తర్వాత ఐదేళ్ల శిక్షను రెండేండ్లకు తగ్గించేలా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సిద్ధార్థ రెడ్డి లొంగిపోయి శిక్ష అనుభవించాలని ఆదేశించింది. దీనితో ఈ సుదీర్ఘ న్యాయపోరాటం ఒక కొలిక్కి వచ్చింది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది.





Leave a Reply