NewsInn

News in a Click

అభివృద్ధిలో తెలంగాణాను ఆదర్శంగా నిలుపుతాం

అభివృద్ధిలో తెలంగాణాను ఆదర్శంగా నిలుపుతాం

ముంబాయిలో సీఎం రేవంత్ రెడ్డి

(ముంబాయి, న్యూస్ఇన్‌)

ప‌ట్ట‌ణాభివృద్ధిలో తెలంగాణాను దేశానికి ఆద‌ర్శంగా నిలుపుతామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లో గ్రీన్ ఎన‌ర్జీని తాము వినియోగించుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. సాంప్రదాయ ఇంధన వనరుల నుంచి సోలార్, గ్రీన్ ఎనర్జీ వైపు మార్చడమే త‌మ ప్ర‌ధాన లక్ష్యమని ఆయ‌న తెలిపారు. కాలుష్య నియంత్రణ, రీసైక్లింగ్, స్థిర శక్తి ఉత్పత్తి పద్ధతులపై నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ను 2034 నాటికి నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. తద్వారా తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతుందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కోర్ అర్బ‌న్ రీజియ‌న్‌(క్యూర్‌)లో దాదాపు పరిశ్రమలు ఉండవని స్పష్టం చేశారు.

ముంబాయిలో జ‌రిగిన ‘క్లైమేట్ వీక్’ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. .కోవిడ్ అనంతరం ప్రభుత్వాల దృష్టికోణం మారిందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ప్రస్తుతం అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారాయని అన్నారు. ఏ ఆర్థిక వ్యవస్థకైనా విద్యుత్ ఉత్పాదక వనరులే అసలైన కరెన్సీ అన్నారు. విద్యుత్ ఉత్పత్తి, వినియోగం అభివృద్ధికి కొలమానంగా నిలుస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్రం రోజుకు సగటున 16,610 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తోందని తెలిపారు. గత ఏడాది గరిష్ట డిమాండ్ 17,162 మెగావాట్లు నమోదైందని, ఈ ఏడాది అది 19,000 మెగావాట్లను దాటుతుందని అంచ‌నాలున్నాయ‌ని వివ‌రించారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంతో గరిష్ట డిమాండ్ 34,000 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశారు. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 24.8% లేదా దాదాపు 25% గ్రీన్ సోర్సుల నుంచే వస్తోందని తెలిపారు.తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న క్రమంలో వనరుల పెరుగుదలలో ప్రధాన భాగం గ్రీన్‌గా ఉండాలని తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను పర్యావరణహితంగా మార్చే దిశగా 2 లక్షలకుపైగా ఆటోరిక్షాలను రీట్రోఫిట్ చేస్తుండగా, 3,500 కంటే ఎక్కువ ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ మెట్రోను ప్రస్తుత 71 కి.మీ. నుంచి 200 కి.మీ. పైగా విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పరిశ్రమలను కోర్ అర్బన్ ప్రాంతం నుంచి పెరి అర్బన్ జోన్‌లకు తరలిస్తున్నామన్నారు.

ముంబాయి స‌ద‌స్సులో పాల్గొన్న అనంత‌రం సీఎం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో జ‌రుగుతున్న ఏఐ స‌ద‌స్సుకు గురువారం హాజ‌రుకానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *