NewsInn

News in a Click

వికారాబాద్ లో కాంగ్రెస్ సంఘటన్ సృజన్ అభియాన్

  • శ‌నివారం నుంచి 10 రోజులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలోని వికార‌బాద్ జిల్లా కేంద్రానికి స‌మీపంలో ఉన్న అనంత‌గిరి కొండ‌ల్లో కాంగ్రెస్ పార్టీ 10 రోజుల శిక్ష‌ణా శిబిరాల‌ను నిర్వ‌హించాల‌ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కేవ‌లం ఆహ్వానితుల‌కు మాత్ర‌మే అక్క‌డికి అనుమ‌తి ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. మీడియా స‌హా ఇత‌రులెవ్వ‌ర‌కీ కూడా 10 రోజుల పాటు ఆ ప్రాంతంలోకి అనుమ‌తి ఇవ్వ‌రాద‌ని నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ ప‌రంగా కూడా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా శిక్ష‌ణా త‌ర‌గ‌తులు మాత్ర‌మే నిర్వ‌హించాల‌ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలుగు రాష్ట్రాల‌కు చెందిన జిల్లా పార్టీ అధ్యక్షుల‌తో పాటు పాటు కొంత మంది కీల‌క నేత‌ల‌కు మాత్ర‌మే ఈ స‌మావేశానికి ఆహ్వానాలు అందాయి. 10 రోజుల పాటు జ‌రిగే స‌మావేశాల‌కు 77 మంది ప్ర‌తినిధులు హాజ‌రు కానున్నారు. ఇందు కోసం అనంత‌గిరి కొండ‌ల్లో టూరిజం హోట‌ల్ హ‌రిత రిసార్ట్ లో శిక్ష‌ణా శిబిరాలు జ‌రుగ‌నున్నాయి. తొలి రోజు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హాజ‌రు కానున్నారు. ముఖ్య‌మంత్రి వ‌స్తుండంతో అధికారులు ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు.

అనంత‌గిరి స‌మీపంలోనే హెలిప్యాడ్ ను ఏర్పాటు చేశారు. మార్చి 2వ తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహూల్ గాంధీ హాజ‌రు కానున‌ట్లు తెలుస్తోంది. దీంతో హ‌రిత రిసార్ట్స్ ప్రాంతంలో ప‌క‌డ్బంధీ బందోబ‌స్తును ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిక్ష‌ణా శిబిరాలకు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ లు కూడా హాజ‌రుకానున్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహ‌న్ రెడ్డి శిక్ష‌ణా శిబిరాల ఏర్పాట్ల‌ను శుక్ర‌వారం ప‌రిశీలించారు.

10 రోజుల పాటు జ‌రిగే స‌మావేశాల‌కు స్థానిక నేత‌లకు కూడా అవ‌కాశం ఇవ్వ‌డం లేదు . ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రేపు మ‌ధ్యాహ్నం శిక్ష‌ణా శిబిరాల‌కు వెళ్లి డీసీసీ అధ్య‌క్షుల‌ను క‌లుసుకుంటారు. డీసీసీ అధ్య‌క్షుల‌ను ఉద్దేశించి సీఎం ప్ర‌సంగిస్తారా లేదా అన్న‌దానిపై ఇంకా స్ప‌ష్ట‌త లేదు. కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించే ఈ శిబిరాల‌కు ఏర్పాటు చేసినా…..క‌ఠిన నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేస్తూ ఎవ‌రినీ అనుమ‌తించ‌డం లేదు. దీంతో స్థానిక నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీ అగ్ర‌నేత‌లు వ‌స్తున్నా క‌లిసే అవ‌కాశం లేక‌పోవ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *