
ఏఐ లివింగ్ ల్యాబ్స్, డిజైన్ ఇంజనీరింగ్ లో భాగస్వామ్యం
(న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రియేటర్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికి వివిధ టెక్ కంపెనీల భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో టెక్ నైపుణ్యాలు ఉన్న యువశక్తి అతిపెద్ద వనరు అని ఆయన వ్యాఖ్యానించారు. వారిని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో నిపుణులుగా తయారు చేసేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకుంటామని ఆయన వెల్లడించారు. ఢిల్లీలోని ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఏపీ అత్యంత అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి వివరించారు. డౌన్ స్ట్రీమ్ పరిశ్రమలతో సహా సమగ్రమైన ఎకోసిస్టమ్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని వెల్లడించారు. ప్రముఖ టెక్ కంపెనీ ఆడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతనూ నారాయణ్ తో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఏపీని నాలెడ్జి హబ్ గా మార్చడమే తన లక్ష్యమని ఏపీలో క్వాంటం కంప్యూటింగ్, డేటా సెంటర్లు, డ్రోన్, స్పేస్ సిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి వివరించారు. రియల్ టైమ్ గవర్నెన్స్, పర్సనలైజ్డ్ మెడిసిన్ వంటి అంశాలపై భవిష్యత్ కార్యాచరణను సీఎం ప్రస్తావించారు. వచ్చే 25 ఏళ్లపాటు దేశానికి, రాష్ట్రానికి అతిపెద్ద వనరుగా యువశక్తి మారనుందని సీఎం వివరించారు. క్రియేటర్ ఎకానమీని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి సహకారం అందించాలని అన్నారు. విద్యార్ధులు, నిపుణులకు మరింత నైపుణ్యాలను అందించేలా ప్రత్యేకంగా క్రియేటర్ సాఫ్ట్ వేర్ ను అందించనున్నట్టు శాంతనూ నారాయణ్ తెలిపారు. ఏఐ లివింగ్ ల్యాబ్స్ తో పాటు పౌరసేవల డిజిటలైజేషన్ అంశంపై కూడా ఇరువురి మధ్యా లోతైన చర్చ జరిగింది.
ఏఐ లివింగ్ ల్యాబ్స్ తో నైపుణ్యం పెంపు….

ఆంధ్రప్రదేశ్ లో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు కోసం ఎన్విడియా సంస్థ సహకారం అందించాలని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కాలిస్టారెడ్మెండ్ కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆ సంస్థ ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతను ప్రోత్సహించేందుకు భాగస్వామ్యం వహించాలని కోరారు. అలాగే ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి తో కలిసి ఏపీ ఫస్ట్ కార్యక్రమంలో భాగస్వామి కావాలన్నారు. ఏపీలో డిజైన్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కోసం ఏపీలో జీసీసీ అభివృద్ధి చేయాలని ఆటోడెస్క్ సీఈఓ మైక్ హేలీని ముఖ్యమంత్రి కోరారు. క్వాంటం టెక్నాలజికి అనుగుణంగా అమరావతిలో ఇన్నోవేషన్ అకాడెమీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లెర్నింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి పాఠశాల విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సహకారం అందించాలని లెగో ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్ ను ముఖ్యమంత్రి కోరారు.
ఏఐ సాంకేతికతను పరిశీలించిన సీఎం..
పారిశ్రామిక వేత్తలతో భేటీ అనంతరం భారత్ మండపంలో ఏర్పాటు చేసిన ఏఐ ఇంపాక్ట్ సమ్మింట్ లోని వివిధ స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. ఎన్విడియా, నేయసా, టాటా, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ సహా వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన ప్రదర్శనను సీఎం ఆసక్తిగా తిలకించారు. వ్యవసాయం, వైద్యారోగ్యం, పరిశ్రమలు తదితర రంగాల్లో ఏఐ వినియోగం, వస్తున్న ఫలితాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏఐ సమ్మిట్ లో టాటా సంస్థ ఏపీలో అమలు చేస్తున్న డిజిటల్ హెల్త్ రికార్డుల కార్యక్రమం సంజీవని, డిజిటల్ నెర్వ్ సెంటర్ ను ప్రదర్శించింది. రోబోటిక్స్ , ఏఐ డ్రివెన్ సేవలకు సంబంధించిన యూజ్ కేసెస్ ను సీఎం ఆసక్తిగా తెలుసుకున్నారు.
విమాన ప్రమాద వివాదంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు







Leave a Reply