
- బాధితులకు అండగా రాజకీయ పక్షాలు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ నగరం నుంచి 55 కిలోమీటర్ల దూరం ప్రయాణించే మూసీ రివర్ డెవలప్ మెంట్ పనులు చేపట్టేందుకు సర్కార్ సిద్ధం అవుతుండడంతో మరోసారి మూసీ బాధితుల ఉద్యమం రాజుకుంటుంది. ఉస్మాన్ సాగర్,హిమాయత్ సాగర్ ల నుంచి వచ్చే నీటి పరివాహక ప్రాంతాల్లో భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం దాదాపు 10 రోజు ల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. తొలి విడతలో భాపు ఘాట్ వరకు గాంధీ సరోవర్ పేరుతో ఓ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ఆ ప్రాంతంలోని నివాసం ఉంటున్న వారికి భూసేకరణపై సమచారం ఇచ్చింది. గతంలోనే ఇందుకు సంబంధించి మార్కింగ్ పూర్తి కావడంతో అధికారులు ఇప్పుడు భూ సేకరణపైనే దృష్టి పెట్టారు. 55 ఎకరాల ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఈ రెండు కీలక ప్రాజెక్టుల సమీపంలోనే దాదాపు 25 ఎకరాలకు పైగా బాపు ఘాట్ వరకు భూసేకరణ చేయాల్సి ఉంది.

దీంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ముందుగా పూర్తి చేయాలన్న యోచనలో ఉంది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు ను ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో వారం రోజు ల క్రితం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రాలను అందచేశారు.
ఇక అప్పటి నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న వారు ఆందోళన బాట పడుతున్నారు. ముందుగా సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న భారీ అపార్ట్ మెంట్ ను భూసేకరణలో భాగంగా తీసుకోవాలని తాజాగా నిర్ణం తీసుకుంది. ఒకే అపార్ట్ మెంట్ లో దాదాపు 400 కుటుంబాలు నివాసం ఉంటుండంతో అక్కడ నివాసం ఉంటున్న వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే తాము కొన్న ఈ ఆపార్ట్ మెంట్ నిర్మాణం పనులు అన్నీ అనుమతులతో మొదలయ్యాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ పేరుతలో తమ ఆపార్ట్ మెంట్ ను స్వాధీనం చేసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అనుమతి లేని, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెడితే మంచిదని సూచిస్తున్నారు. వేలాది కుటుంబాలు ఈప్రాంతంలోని మూసీ పునరుజ్జీవ పథకం బాధితులుగా మారే అవకాశం ఉండడంతో బీఆర్ ఎస్ నేత హరీష్ రావ్ ఆదివారం హైదర్షాకోట్ ప్రాంతంలో బాధితులను కలుసుకోనున్నారు. గతంలో కూడా బీఆర్ ఎస్ కీలక నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. తాజాగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా భూసేకరణకు అడుగులు వేస్తుండడంతో ప్రతిపక్ష పార్టీలు ఈ అంశానికి అంతే ప్రాధాన్యతనిస్తున్నాయి.






Leave a Reply