NewsInn

News in a Click

తెలంగాణా ప‌బ్లిక్ స్కూల్స్- ప్ర‌భుత్వం ప్లాన్ రెడీ

CM REVANTH REDDY  DIRECTIONS TO EDUCATION DEPARTMENT OFFICIALS

స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్ల‌ను వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. త‌ర‌గ‌తి గ‌దులు, క్రీడా మైదానం, ఇత‌ర అన్ని ర‌కాల వ‌స‌తులు, బోధ‌నా సిబ్బంది, ర‌వాణా సౌక‌ర్యం క‌లిగి ఉన్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్ త‌ర‌హాలోనే ఈ వంద స్కూళ్లు ఉండాల‌ని సీఎం ఆదేశించారు. విద్యా శాఖ‌పై కమాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం స‌మీక్ష నిర్వ‌హించారు. నాణ్య‌మైన విద్య‌కు చిరునామాగా తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను తీర్చిదిద్దాల‌ని సీఎం పేర్కొన్నారు. కోర్ అర్బ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ (క్యూర్‌) ప‌రిధిలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను కార్పొరేట్ పాఠ‌శాల‌ల త‌ర‌హాలో నిర్మించాల‌ని సీఎం ఇంజినీర్ల‌ను ఆదేశించారు. వీటి నిర్మాణంలో ఆధునిక సాంకేతిక‌త‌ను వినియోగించుకోవాల‌ని, ఏడాదిలో క్యూర్ ప‌రిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ నూత‌న పాఠ‌శాల‌ల నిర్మాణం పూర్తి కావాల‌ని సీఎం ఆదేశించారు. న‌గ‌రంలోని భార‌తీయ విద్యా భ‌వ‌న్‌, జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్కూళ్ల‌లో ఉండే అన్ని వ‌స‌తులు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠ‌శాల‌ల్లో ఉండాల‌ని సీఎం తెలిపారు. క్యూర్‌లో అప్‌గ్రేడ్ చేయ‌నున్న 17 పాఠ‌శాల‌లు, అద‌న‌పు గ‌దులు, ఇత‌ర వ‌స‌తులు క‌ల్పించ‌నున్న 164 పాఠ‌శాల‌ల ప‌నుల్లో ఎటువంటి రాజీ ప‌డ‌కూడ‌ద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో 99 రోజుల పాటు చేప‌ట్ట‌నున్న కార్య‌క్ర‌మాల్లో వారం రోజులు విద్యా సంబంధిత అంశాల‌కు కేటాయించాల‌ని సీఎం సూచించారు. ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌ను సంద‌ర్శించి అవ‌స‌ర‌మైన వ‌స‌తుల క‌ల్ప‌న‌, ఇత‌ర అంశాల‌ను తెలుసుకొని వాటి ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

AI పై ఫోక‌స్ పెంచాలి…

కృత్రిమ మేథ (AI) ప్ర‌పంచాన్ని శాసిస్తున్న నేప‌థ్యంలో పాఠ‌శాల స్థాయి నుంచి దాని బోధ‌న‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. మారుతున్న సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకునేలా ఏఐపై ఉపాధ్యాయులు, లెక్చ‌ర‌ర్ల‌కు స్వ‌ల్ప‌కాలిక శిక్ష‌ణ త‌ర‌గ‌తులు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. AIతో ప్రపంచ వ్యాప్తంగా వ‌చ్చే మార్పుల‌ను తెలుసుకొని దాని ద్వారా వ‌చ్చే అవ‌కాశాలు మ‌న విద్యార్థులే అందిపుచ్చుకునేలా మ‌న స‌న్న‌ద్ధ‌త ఉండాల‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. సాంకేతిక విద్యా విధానంలో అందుకు అనుగుణ‌మైన మార్పుల‌ను తీసుకురావాల‌ని సీఎం పేర్కొన్నారు.

ఫీజుల నియంత్ర‌ణ‌పై….

ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ఫీజుల నియంత్ర‌ణ‌కు సంబంధించి తెలంగాణ ప్రైవేటు పాఠ‌శాల‌ల ఫీజు రెగ్యుల‌ట‌రీ మానిట‌రింగ్ క‌మిష‌న్ త‌మ నివేదికలోని అంశాల‌ను ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎదుట ఉంచింది. వివిధ రాష్ట్రాల్లో అమ‌ల్లో ఉన్న విధానాలు, తెలంగాణ‌లో తీసుకోవాల్సిన అంశాల‌ను వివ‌రించారు. సావ‌ధానంగా విన్న ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి జిల్లా స్థాయిలో క‌లెక్ట‌ర్‌, డీఈవోల నేతృత్వంలో పాఠ‌శాల‌ల‌ను ప‌రిశీలించి ఫీజుల నిర్ణ‌యంపై నివేదిక స‌మ‌ర్పించాల‌న్నారు.. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జ‌డ్జి లేదా రిటైర్డ్ చీఫ్ సెక్ర‌ట‌రీ స్థాయిలోని క‌మిటీ తుది క‌మిటీగా ఉండి నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని తెలిపారు. అలాగే ఫీజు నియంత్ర‌ణ‌కు సంబంధించి విద్యార్థుల త‌ల్లిదండ్రులు, మేధావులు, సామాజిక‌వేత్త‌ల అభిప్రాయ సేక‌ర‌ణ‌కు ముసాయిదాను ప‌బ్లిక్ డొమైన్‌లో ఉంచాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *