NewsInn

News in a Click

శివ(రాత్రి) ఉత్సవాలు-విద్యార్థులు -సరసాలు

శివ(రాత్రి) ఉత్సవాలు-విద్యార్థులు -సరసాలు

మల్లారెడ్డి కళాశాల నిర్వాకం

(హైదరాబాద్, న్యూస్ఇన్)

ఇటీవల జరిగిన శివరాత్రి పండుగ సందర్భంగా మల్లారెడ్డి కళాశాలలో చోటు చేసుకున్న పరిణామాలు చర్చినీయంశంగా మారాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కళాశాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. శివరాత్రి పండుగ సందర్భంగా సీఎంఆర్ కళాశాల ఆవరణలో జాగరణ కోసం కళాశాల యాజమాన్యం భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. కళాశాల ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి…. ఇదే సమయంలో విద్యార్థులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారుతుంది. జాగరణ సందర్భంగా ఓవైపు భక్తి పారవశ్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా…. మరోవైపు విద్యార్థులు, విద్యార్థినిలు సరసాల్లో మునిగితేలుతున్న వీడియోలు బయటపడ్డాయి. దాదాపు 15 రోజుల తర్వాత ఈ వీడియోలు వెలుగు చూడడం కలకలం రేపింది. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టేజికి దూరంగా కూర్చున్న విద్యార్థులు…. తమ సహచర విద్యార్థులతోనే అసభ్యంగా వ్యవహరించడం, కొంతమంది విద్యార్థులు ఈ సన్నివేశాలను వీడియోలు చిత్రించడంతో విద్యార్థుల గ్రూపుల్లో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. విద్యార్థుల సమీపం నుంచే కళాశాల యజమాని మాజీ మంత్రి మల్లారెడ్డి వెళుతున్నా విద్యార్థులు ఆయనను పట్టించుకోకపోవడం, ఆయన విద్యార్థులను మందలించకపోవడం కూడా చర్చకు దారితీస్తుంది. కళాశాల యజమానిగా… చూసి చూడనట్లు వ్యవహరించడంపై మల్లారెడ్డి తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినా… విద్యార్థుల వ్యవహార శైలిపై కూడా నిఘా ఉంచాల్సిన బాధ్యత కళాశాల యాజమాన్యం పై ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతంగా విద్యార్థులను తీర్చిదిద్దే కళాశాలల్లోనే విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తిస్తే…. చూసి చూడనట్లు ఉండడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

జాగరణ కోసం 3వేలు….

ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా మల్లారెడ్డి కళాశాలలో విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయడం విశేషం. ఒక్కో విద్యార్థి 3000 రూపాయలు చెల్లించాల్సిందేనని కళాశాల టికెట్ ధర నిర్ణయించింది. రాత్రి 9 గంటలకు మొదలైన జాగరణ కార్యక్రమాలు తెల్లవారుజాము మూడు గంటల వరకు కొనసాగాయి. ఈ సమయంలోనే కొంతమంది విద్యార్థులు అతిగా ప్రవర్తించడం కళాశాల యాజమాన్యం వ్యవహరించిన తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

అనుమతి ఉందా….

శివరాత్రి రోజు కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు యాజమాన్యం ఏమైనా అనుమతులు తీసుకుందా…. అనధికారికంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అన్నది కూడా తేలాల్సి ఉంది. వేలాది మంది విద్యార్థులు,విద్యార్థినిలు హాజరైన సందర్భంగా అనుసరించాల్సిన విధానాలపై కళాశాల యాజమాన్యం పట్టించుకోకపోవడం అసలు సమస్య అని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తమ పిల్లలకు అనుమతులు ఇచ్చారు. కానీ అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు వెలుగు చూసిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కళాశాలలో తమ పిల్లలు చదువులు కొనసాగిస్తే విద్యాభ్యాసం ఎంతవరకు సవ్యంగా సాగుతుందన్నది తల్లిదండ్రులను ఇప్పుడు ఆలోచింపజేస్తున్న ప్రశ్న.

అక్కడ ఫీజులు చెల్లిస్తే చాలు…

ఫీజుల వసూలులో యాజమాన్యం నిక్కచ్చిగా వ్యవహరిస్తూ…. విద్యార్థుల భవితవ్యాన్ని అయోమయంలో వేసే విధంగా నిర్వహణ ఉండడం ఎంతవరకు సమంజసమని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ఫీజుల వసూలు సందర్భంగా వ్యవహరించినట్లే విద్యార్థులను క్రమశిక్షణలో ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా కళాశాల యాజమాన్యంపై లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

చర్యలు ఉంటాయా… ?

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడం, ప్రధాన మీడియా సంస్థలు కూడా ప్రసారం చేయడంతో…. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది.యాజమాన్యంపై పోలీసు కేసులు నమోదు చేస్తారా లేదా…ఉన్నత విద్యాశాఖ కు ఇలాంటి విషయాల్లో యాజమాన్యం వైఖరి పై చర్యలు తీసుకునే అధికారాలు ఉన్నాయా లేదా అన్నది ఇప్పుడు అందరిని వెంటాడుతున్న ప్రశ్నగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *