

( న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. రెండు స్థానాల్లో ఒక స్థానాన్ని ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్ సింగ్వీ కే ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణా నుంచి జాతీయ నాయకత్వం సిఫారసుతో అభిషేక్ సింగ్వీకి మరోసారి పార్టీ అవకాశం కల్పించింది. మిగిలిన మరో స్థానంపై గత కొన్ని రోజులుగా ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. సామాజిక సమీకరణలు తెరపైకి వచ్చాయి. మరో సీటు ఎవరికి దక్కుతుందా అన్న చర్చలు జోరుగా సాగాయి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆ స్థానంపై కూడా స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ పెద్దలను ఒప్పించి సీఎం తన సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి కట్టబెట్టేలా అధిష్టానన్ని ఒప్పించడంలో విజయవంతం అయ్యారు ఒక స్థానం హై కమాండ్ తీసుకోగా మరో స్థానం సీఎం రేవంత్ ఇష్టానికే వదిలేసినట్లయింది. గత కొన్ని రోజులుగా వేం నరేందర్ రెడ్డి పేరు వినిపించినా…రాజకీయంగా సాధ్యాసాధ్యాలపై ఎన్నో అంశాలు తెరపైకి వచ్చాయి. కానీ సీఎం తనతో పాటు రాజకీయంగా అడుగులు వేసిన వేం నరేందర్ రెడ్డికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం…సీఎం రేవంత్ ప్రతిపాదనలతో కాంగ్రెస్ పెద్దలు కూడా ఏకీభవించడంతో వేం నరేందర్ రెడ్డిని అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ హై కమాండ్ ఖరారు చేసింద. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఈ స్థానంపై ఆశలు పెంచుకున్నా….కాంగ్రెస్ పెద్దలు కనీసం వారి పేర్లు కూడా పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. రాజకీయంగా సీఎం రేవంత్ తనను నమ్ముకుని తనతో వచ్చిన వారికి ఎదో ఒక రకంగా అవకాశాలు కల్పిస్తున్నారన్న ప్రచారానికి ఇది కూడా ఒక ఉదాహరణగా కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. వేం నరేందర్ రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న సమయం నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్న సమయంలో ఆయనతో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. శాషనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా అప్పట్లో అది సాధ్యం కాలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వేం నరేందర్ రెడ్డికి ప్రభుత్వ సలహా దారు పదవి కట్టబెట్టి అత్యంత ప్రాధన్యత ఇస్తూ వచ్చారు. ఇక తాజాగా రాజ్యసభ సభ్యుడిగా కూడా అవకాశం దక్కడం వెనుక సీఎం మంత్రాంగమే పనిచేసింది. గురువారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ దూరం…..
రాష్ట్రం నుంచి రెండు స్థానాలు దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉండడంతో బీఆర్ ఎస్ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత కేసిఆర్ కీలక నేతలకు ఇవే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్ ఎస్ పోటీలో లేకపోతే ఇక రాజ్యసభ ఎన్నికలు రాష్ట్రంలో ఏక్రగీవం కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల ఎన్నిక లాంఛనం కానుంది.


Leave a Reply