
- 2014 లో టీడీపీ, 2018 లో కాంగ్రెస్
- ఎమ్మెల్యేలు చేరిన రోజులు ఏ రోజులు
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ అనర్హతపై చర్యలపై స్పీకర్ నిర్ణయం సంచలనంగా మారింది. స్పీకర్ తుది నిర్ణయంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణ, ఇప్పుడు ఈ వ్యవహారంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హతపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్పందించడం హాస్యాస్పదంగా ఉంది.
తెలంగాణలో 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. కొన్ని అనివార్య కారణాల వల్ల జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో కాంగ్రెస్ బలం 66కు పెరిగింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు స్వర్గస్తులు కాగా పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా బీఆర్ఎస్ చెబుతోంది, వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరారు గులాబీ పార్టీ నాయకులు. కాగా పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల పిటీషన్లను స్పీకర్ కొట్టేసారు. ఈ నిర్ణయం పట్ల గులాబీ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజా స్వామ్యంలో చీకటి రోజుగా అబివర్ణిస్తున్నారు. ఇవే ఫిరాయింపుల పట్ల గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత దారుణంగా వ్యవహరించిందో ఒకసారి చూద్దాం.

2014, 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం.., తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా ఇళ్లలోకి వెళ్లి ఏ విధంగా గులాబీ పార్టీ కండువా కప్పారు అనే విషయాన్ని చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు వారిని అనర్హులుగా ప్రకటించి ఎన్నికలకు ఎందుకు వెళ్లలేదనే మిలియన్ డాలర్ల ప్రశ్నకు మాజీ సీఎం కేసీఆర్ లేదా మాజీ మంత్రి కేటీఆర్ను సమాధానం చెప్పాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. 2014లో తెలంగాణలో గులాబీ పార్టీ అధికారం చేపట్టినప్పటికీ, ప్రతిపక్ష పార్టీల నుంచి ఫిరాయింపులను దారుణంగా ప్రోత్సహించింది. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్) 15 మంది సభ్యులున్న తెలుగుదేశం శాసనసభా పక్షం మొత్తాన్ని విలీనం చేసుకుంది. సాంకేతికంగా ఉన్న నిబంధన కారణంగా ఒక్కొక్కరు పార్టీలో చేరినా….అంతా ఒకేసారి చేరి టీడీఎల్పీ విలీనం అయిందని ఆ నాడు బీఆర్ ఎస్ ప్రకటించింది. వ్యూహాత్మకంగా బీఆర్ ఎస్ అనుసరించిన విధానంతో ఆ రోజు అప్పటి స్పీకర్ బీఆర్ ఎస్ ప్రతిపాదనలకు ఎస్ చెప్పారు. 15 సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ, నాలుగేళ్లు గడిచే సరికి రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్.కృష్ణయ్యలు మాత్రమే ఆ పార్టీ ఎమ్మెల్యేలుగా మిగిలారు. ఆ నాడు గులాబీ పార్టీ చేసిన ఫిరాయింపుల అంశంపై బీఆర్ ఎస్ స్పందించిన తీరు ఇప్పుడు తెరపైకి వస్తోంది.

తెలంగాణలో 2018 ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు లు పార్టీలో విలీనం చేసుకోవాల్సిందిగా టీఆర్ఎస్ను కోరగా ఆ విలీనం కూడా వెంటనే జరిగిపోయింది. కాగా 2018 ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలవగా, దశలవారీగా 16 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ చేర్చుకోగా, కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేసినట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన సభ్యులు ముగ్గురే అసెంబ్లీలో మిగిలారు. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఈ విలీన ప్రక్రియకు ముందే అప్పటి స్పీకర్కు విజ్జప్తి చేశారు కాంగ్రెస్ నాయకులు. ఐతే కాంగ్రెస్ నుంచి నలుగురైదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారగానే అనర్హులుగా ప్రకటించాలని కోరినప్పటికీ, స్పీకర్ కాంగ్రెస్ విజ్ఞప్తిని వినకుండా ఎమ్మెల్యేలందరూ చేరేవరకు వేచి చూసి విలీనం అయినట్లుగా ప్రకటించడం చీకటి రోజులు కావా అన్న వాదనను కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది అప్పటి స్పీకర్ తన అధికారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయలేదని కేటీఆర్ చెప్పగలరా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుండి పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంలో పొంతనలేనని వాదాన్ని వినిపిస్తోంది గులాబీ పార్టీ. పార్టీ ఫిరాయింపుల పట్ల గతంలో వారు అవలంబించిన విధానాలకు భిన్నంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుంటే కేటీఆర్ తప్పుగా చిత్రీకరిస్తుండండం శోచనీయం. టిడిపి సభ్యుడిగా ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్, కాంగ్రెస్ సభ్యురాలిగా ఉన్న సబితా ఇంద్రా రెడ్డి లను క్యాబినెట్ లోకి తీసుకుని నేరుగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించింది కేసీఆర్ సర్కార్. మరి అప్పుడు లేని నైతిక విలువలు కేటీఆర్ కు ఇప్పుడే గుర్తొచ్చాయా అనేది ప్రధాన ప్రశ్న. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్ఘన్ పూర్), కాలె యాదయ్య (చేవెళ్ల), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్ర నగర్), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (గద్వాల), ఎం. సంజయ్ కుమార్ (జగిత్యాల) పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఇందులో 8మంది ఎమ్మెల్యేలకు గతంలో క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ తాజాగా బుదవారం కడియం శ్రీహరి, దానం నాగేందర్ లకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా బీఆర్ఎస్ పార్టీ అభివర్ణించడం విచారకరం. మరో వైపు స్పీకర్ నిర్ణయాన్ని ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్వాగతించారు.


Leave a Reply