- ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
(అమరావతి,న్యూస్ఇన్)
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలోని దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేలా ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకానికి బుధవారం అమరావతిలో శ్రీకారం చుడతారు. అలాగే ప్రతీ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే దివ్యాంగ శక్తిని ప్రారంభించనున్నాను. ఈ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని మరోసారి నిరూపించింది. గతేడాది డిసెంబర్ 3న నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారు.

స్త్రీశక్తి బస్సులే వర్తింపు…..
ప్రస్తుతం 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు, 100 శాతం కంటి చూపు కోల్పోయిన వాళ్లకు, 100 శాతం మూగ, చెవిటి వారికి, అలాగే 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న మానసిక దివ్యాంగులు మాత్రమే ఏపీఎస్ ఆర్టీసీ సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో వీరికి 50 శాతం రాయితీ లభిస్తోంది. 100 శాతం అంధత్వం, మానసిక వైకల్యం ఉన్నవారితో వచ్చే సహాయకులకు 50 శాతం రాయితీ లభిస్తోంది.
21 వర్గాలకు పథకం విస్తరణ….
ఇప్పటివరకు కేవలం 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండేది. ఇకపై 21 వర్గాల దివ్యాంగులకు ఈ సౌకర్యాన్ని విస్తరించింది. శారీరక-మానసిక దివ్యాంగులు, ఆటిజం, నాడీ సంబంధ వ్యాధులు, పార్కిన్సన్స్, తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ వంటి వ్యాధిగ్రస్తులకు ఈ పథకంతో భరోసా కలుగుతుంది. ప్రస్తుతం 1.71 లక్షల దివ్యాంగులకే లబ్ది చేకూరుతుండగా… పథకం విస్తరణతో ఇకపై 11.16 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం కలుగుతుంది. వీరిలో పురుషులు 6.86 లక్షల మంది ఉన్నారు. అలాగే ఇప్పటివరకు 33,800 మంది సహాయకులకే రాయితీ లభిస్తుండగా… ఇకపై 1.60 లక్షల మంది సహాయకులకు 50 శాతం రాయితీ లభించనుంది. దీంతో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే మొత్తం లబ్దిదారుల సంఖ్య 2.05 లక్షల నుంచి 12.76 లక్షలకు పెరిగనుంది.







Leave a Reply