- వారికి ఆత్మీయ విందు
(అమరావతి, న్యూస్ఇన్)
దివ్యాంగుల శక్తిని ప్రపంచానికి చాటేలా ఆత్మ స్థైర్యంతో పని చేసేలా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దివ్యాంగులు సాధికారత సాధించడానికి.. వారి గౌరవాన్ని మరింత పెంచడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని దివ్యాంగులకు అందుబాటులోకి తెస్తూ దివ్యాంగ శక్తి పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏపీఎస్ ఆర్టీసీలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.

మొత్తంగా 21 కేటగిరీల బస్సుల్లో 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. దివ్యాంగుల వెంట వచ్చే సహాయకులతో కలిపి మొత్తంగా 12.76 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం కల్పించేలా ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకం ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, లబ్దిదారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ ముందుకు సాగారు. దివ్యాంగులతో కలిసి ప్రయాణం చేసిన అనంతరం తన నివాసంలో దివ్యాంగ శక్తి పథకంలోని పలువురు లబ్దిదారులకు సీఎం ఆత్మీయ విందు ఇచ్చారు. విందుకు వచ్చిన వారిని ముఖ్యమంత్రి అప్యాయంగా పలకరించారు. వారితో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భోజనం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించటంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు దివ్యాంగులు ధన్యవాదాలు తెలిపారు. తమ వెంట వచ్చే సహాయకులకు ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పించటంపై హర్షం వ్యక్తం చేశారు.
దివ్యాంగుల్లో ఆత్మ విశ్వాసం నింపుతాం….

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… దివ్యాంగ శక్తి పథకంతో ఈ ఉగాది మరింత వేడుకగా జరుపుకోండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. 21 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. దివ్యాంగ శక్తి పథకం ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగిస్తోంది. నేను, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి ఈ పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులతో కలిసి ప్రయాణించటం సంతృప్తిని ఇచ్చిందన్నారు. దివ్యాంగుల పెన్షన్ ను రూ.6 వేలకు పెంచి ఇస్తున్నాం. తీవ్ర ఆరోగ్య ఇబ్బందుల్లో ఉండే వారికి రూ.10 వేలు, మంచానికి పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. ఏటా పింఛన్ల కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు.









Leave a Reply