జిల్లాల వారీగా సర్పంచులతో భేటీ కానున్న కేటీఆర్
10 రోజులు వరుసగా సమావేశాలు
(హైదరాబాద్, న్యూస్ ఇన్)
రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు దారులుగా ఎన్నికల్లో విజయం సాధించిన నేతలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కానున్నారు. ఇప్పటివరకు మొదటి దశ ఫలితాలు మాత్రమే విలువడ్డాయి. రెండు, మూడోదశ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో బిఆర్ఎస్ మద్దతుదారులుగా బరిలో ఉండి సర్పంచులుగా విజయం సాధించిన నేతలతో కేటీఆర్ భేటీ అవుతున్నారు.శనివారం హైదరాబాద్లోని నంది నగర్ నివాసంలో పలు జిల్లాల నుంచి తరలివచ్చిన నూతన సర్పంచులు కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని బలప్రయోగం చేసినా, ఎన్ని అక్రమాలకు పాల్పడినా ప్రజలు మాత్రం భారత రాష్ట్ర సమితి వెంటే నిలిచారన్నారు. మొదటి దశ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు భారీగా గెలవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చిన ప్రతి ఒక్కరి పోరాట పటిమను ఆయన అభినందించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులు విజయం సాధించడం గమనార్హం అన్నారు. కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గెలిచిన సర్పంచులు కేటీఆర్ను కలిశారు. “స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇంత పెద్ద ఎత్తున మన సర్పంచులు గెలవడం.. కాంగ్రెస్ పాలన పట్ల ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతకు తెలియజేస్తుందన్నారు. నల్లగొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి వచ్చిన సర్పంచులు శనివారం కేటీఆర్ను కలిశారు. రానున్న వారం, పది రోజుల పాటు కేటీఆర్ వరుసగా వివిధ జిల్లాల నుంచి వచ్చే నూతన సర్పంచులను కలుసుకోనున్నారు. వారిని సత్కరించి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.








Leave a Reply