NewsInn

News in a Click

అప్పుడు ‘ఐటీ’…… ఇప్పుడు ‘క్వాంటం’

అప్పుడు ‘ఐటీ’…… ఇప్పుడు ‘క్వాంటం’
  • సీఎం చంద్రబాబు నాయుడు

(హైదరాబాద్,న్యూస్ఇన్‌)

మూడు దశాబ్దాల క్రితం చేసిన విజన్ ఇప్పుడు ప్రతిఫలాలను ఇస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గతంలో అమలు చేసిన ఐటీ, టెక్నాలజీ, విద్యుత్ సంస్కరణలు ఇప్పుడు ప్రయోజనాలను దక్కేందుకు కారణమవుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఈవో సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్ 2026, ట్రాన్స్ ఫార్మింగ్ ఏఐ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సులో ది ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే అంశంపై సీఎం అభిప్రాయాలను పంచుకున్నారు. నాలెడ్జి ఎకానమీదే భవిష్యత్తు అని ఆలోచన చేసి టెక్నాలజీని ప్రోత్సహించి ఐటీని అందిపుచ్చుకున్నామని స్పష్టం చేశారు.

వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న అప్పటి ఉమ్మడి ఏపీని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే ఆర్ధిక సంస్కరణల్ని అందిపుచ్చుకున్నామన్నారు. ఐటీకి ఇచ్చిన ప్రోత్సాహం కారణంగానే బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలను వదిలి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లోకి అడుగుపెట్టిందన్నారు. ఐఎస్ బీ, జీనోమ్ వ్యాలీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వచ్చాయన్నారు. గతంలో తీసుకున్న నిర్ణయాల వల్లే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలూ ఫార్మా రంగంలోనూ నెంబర్ వన్ గా ఉన్నాయన్నారు. కరోనా సమయంలోనూ ప్రపంచానికి హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీ వ్యాక్సీన్ అందించిందన్నారు. రాజకీయ కారణాల వల్ల ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా గతంలో తీసుకువచ్చిన సంస్కరణలు తెలుగు ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచాయన్నారు.

ఇప్పుడు ఇక క్వాంటం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ లాంటి భవిష్యత్ టెక్నాలజీలతో రాష్ట్రంలో సుపరిపాలన అందించేలా కార్యాచరణ చేస్తున్నామని అన్నారు. గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియా లాంటి రంగాలు విద్యుత్ రంగాన్ని శాసిస్తాయని సుస్థిర విద్యుత్ ఉత్పాదనతో విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం రాబోదన్నారు. ప్రస్తుతం యుద్ధ ప్రభావం నేపథ్యంలో ఎల్పీజీ కొరత ఏర్పడిందని ఈ కారణంగానే పైప్డ్ నాచురల్ గ్యాస్ సరఫరా కీలకంగా మారిందన్నారు. యుద్ధానంతర పరిస్థితుల రీత్యా వివిధ అంశాల్లో మనల్ని మనం సర్దుబాటు చేసుకోవాల్సిన అంశాలు తలెత్తాయన్నారు. దక్షిణ భారత్ లోనే గ్రీన్ ఇంధనం ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో ఉంటుందన్నారు.

ప్రస్తుతం ఏఐ లాంటి టెక్నాలజీ ద్వారా తిరుమల లాంటి పుణ్యక్షేత్రాల్లో దర్శనాల కోసం వేచి ఉండే సమయాన్ని కుదించగలిగామని వేగంగా దర్శనాలు చేయించే సామర్ధ్యాన్ని 15 నుంచి 20 శాతానికి పెంచగలగామన్నారు. ఆధునిక ల్యాబ్ ద్వారా ప్రసాదం తయారీలో వినియోగించే పదార్ధాలను నిత్యం పర్యవేక్షిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని నిరంతరం తెలుసుకునేలా డిజిటల్ హెల్త్ రికార్డులు రూపోందిస్తున్నామన్నారు. త్వరలో ఏఐ డాక్టర్ సేవలతో పాటు రైతులకు ఉపకరించేలా ఏఐ ఆగ్రానమిస్ట్ సేవలు అందించబోతున్నామన్నారు.

యువపారిశ్రామిక వేత్తలకు స్వాగతం….

అమరావతిని టెక్నాలజీ అనుసంధానించి స్మార్ట్ సిటీగా బ్లూ గ్రీన్ రాజధానిగా నిర్మిస్తున్నామని అన్నారు. ఏపీలో మూడు రీజియన్లుగా అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు.అమరావతిలో త్వరలోనే క్యాంటం కంప్యూటర్ పనిచేయటం ప్రారంభిస్తుందని సీఎం వివరించారు. త్వరలోనే క్వాంటం కంప్యూటర్ తయారీకి అవసరమైన పరికరాల తయారీ కూడా చేసేలా ప్రణాళికలు చేశామన్నారు. ఇప్పుడు గూగుల్ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోందని.. రిలయన్స్ కూడా డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. 2047 స్వర్ణాంధ్ర ద్వారా రాష్ట్రాభివృద్ధికి విజన్ రూపకల్పన చేశామన్నారు.

తిరుమ‌ల‌లో ఏ ఐ తో సేవ‌లందిస్తున్నామ‌న్న చంద్ర‌బాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *