(హైదరాబాద్,న్యూస్ఇన్)
కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు నిర్ణయం తీసుకోవడాన్ని తాము స్వాగతిస్తామని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు. డీలిమిటేషన్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 2014లోనే జరగాలి.
12 ఏళ్ళ కింద జరగాల్సిన డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలైనా సంతోషమే. అయితే జనాభా ప్రాతిపదికన గనుక ఈ డీలిమిటేషన్ జరిగితే దక్షిణ భారతదేశానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి మేము ఆ రోజైనా, ఈ రోజైనా చెప్పేది ఒక్కటే – పాపులేషన్ ప్రాతిపదికన కాకుండా గతంలో 1971 జనాభా లెక్కల ప్రకారం ఏ విధంగా చేశారో, అదే విధంగా ప్రస్తుతం ఉన్న నిష్పత్తిలోనే డీలిమిటేషన్ చేస్తే బాగుంటుంది.
దక్షిణ భారతదేశం అంతా కలిసి దేశంలోని 24 శాతం పార్లమెంట్ లో ప్రాతినిథ్యం ఉంది. దానికి నష్టం రాకుండా కొనసాగించాలని కోరుతున్నాము. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు కూడా పెంచుతామంటున్నారు, మేము దాన్ని స్వాగతిస్తున్నాము. అసెంబ్లీ సీట్లు పెంచితే ఎక్కువ మంది ప్రజా ప్రతినిధులు ఉండటం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రభుత్వాలు ప్రజలకు మరింత చేరువ అవుతాయి. అశ్వారావుపేట లాంటి దగ్గర లక్షా ముప్పై వేల ఓట్లే ఉంటే, శేరిలింగంపల్లి దగ్గర తొమ్మిది లక్షల ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఇంత భారీ వ్యత్యాసం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
దక్షిణాది రాష్ట్రాలు అన్నీఆర్ధిక సూచీల్లో అగ్రభాగాన ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే ఆనాడు చెప్పిన కుటుంబ నియంత్రణ పాటించాయి కాబట్టి, దక్షిణ భారతదేశానికి, దక్షిణ భారత రాష్ట్రాలకి నష్టం జరగకుండా, వాటి గొంతు కోయకుండా డీలిమిటేషన్ చేస్తే స్వాగతిస్తాము.





Leave a Reply