(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఆర్టీసి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో పెట్రోల్,డీజిల్ కొరత పెరుగుతుందన్న ప్రజల్లో ఆందోళనను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పరిధిలో పలు బస్సుల్లో రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసి ఎండీ నాగిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. హైదరాబాద్ పరిధిలో మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న సామాన్యుడి కష్టాలను గమనించి, సుఖవంతమైన ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం రాయితీని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
సమయం & ఇంధనం ఆదా …
పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని ఎండీ నాగిరెడ్డి సూచించారు. సొంత వాహనాల కోసం గంటల తరబడి వేచి చూసే బదులు, క్షేమంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులే మేలని పేర్కొన్నారు.

ఇంధన పొదుపు
ఇంధన సంక్షోభం నెలకొన్న తరుణంలో ప్రతి చుక్క పెట్రోల్ విలువైనదే. వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణాను ఆశ్రయించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పడుతుందని ఆయన తెలిపారు.
కాలుష్య రహిత ప్రయాణం..
రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన కోరారు.
అయితే రాయితీని ఎన్ని రోజులు అమలు చేస్తారన్న విషయాన్ని ఆర్టీసి వెల్లడించలేదు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం సంస్థ తీసుకుంది.





Leave a Reply