NewsInn

News in a Click

చిన్నారుల‌కు నాణ్య‌మైన‌ విద్య‌.. పోష‌కాహారం

స‌మ‌గ్ర‌ మాన‌వాభివృద్ధి పై సీఏం స‌మీక్ష‌

(హైద‌రాబాద్‌,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలోని ప్ర‌తి చిన్నారికి నాణ్య‌మైన విద్య‌, పోష‌కాహారం అందించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ప్ర‌ముఖ ఆర్థికవేత్త కార్తీక్ ముర‌ళీధ‌ర‌న్ గురువారం భేటీ అయ్యారు. రాష్ట్ర శాస‌న‌మండ‌లి హాల్‌లో గురువారం జ‌రిగిన స‌మావేశంలో ప‌లు అంశాలపై వారు చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 0-10 ఏళ్లలోపు పిల్ల‌ల్లో పోష‌కాహారం లోపం.. విద్యాభ్యాస‌న స్థాయి సామ‌ర్థ్య‌లోపాల‌కు సంబంధించి ప‌లు నివేదిక‌ల‌ను కార్తీక్ ముర‌ళీధ‌ర‌న్ సీఎం దృష్టిక తీసుకువ‌చ్చారు. చిన్న వ‌య‌స్సులో పోష‌కాహారం లోపంతో భ‌విష్య‌త్‌లో త‌లెత్తే ఆరోగ్య స‌మ‌స్య‌లు.. ప్రాథమిక స్థాయిలో స‌రైన బోధ‌న ల‌భించ‌క‌పోతే విద్యార్థి భావి జీవితంలో ప‌డే మాన‌సిక వేద‌న‌ను ఆయ‌న తెలియ‌జేశారు. వాటిని అధిగ‌మించ‌డానికి తీసుకోవాల్సిన అంశాల‌ను ఆయ‌న సీఎంకు సూచించారు. ఆయా అంశాల‌పై తాము ఇప్ప‌టికే ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాఠ‌శాలల్లో మ‌ధ్యాహ్న భోజ‌నంతో పాటు అల్పాహారం పెట్టేందుకు బ‌డ్జెట్ లో కేటాయింపులు చేసిన‌ట్లు వివ‌రించారు. అంగ‌న్‌వాడీల్లో కార్య‌క‌ర్త‌లు, ఆయాల‌తో పాటు పోష‌కాహారం అంద‌జేసేందుకు అద‌నంగా మ‌రొక‌రిని నియ‌మించాల‌ని కార్తీక్ ముర‌ళీధ‌ర‌న్ సూచించారు. అంగ‌న్‌వాడీల్లో పిల్ల‌ల‌కు పోష‌కాహారం అంద‌జేసేందుకు పోష‌ణ స‌ఖి పేరుతో మ‌రొక‌రిని నియ‌మించేందుకు అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలియ‌జేశారు. కార్తీక్ ముర‌ళీధ‌ర‌న్ సూచించే అంశాల‌ను కోర్ అర్బ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ (క్యూర్‌) ప‌రిధిలోని 29 స్కూల్ కాంప్లెక్స్‌ల ప‌రిధిలో ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేసేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *