NewsInn

News in a Click

మూసీ ప‌నులు మొద‌లు పెట్టనున్న స‌ర్కార్

మూసీ ప‌నులు మొద‌లు పెట్టనున్న స‌ర్కార్
  • సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

మూసీ పున‌రుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి ప‌నుల‌కు ప్ర‌భుత్వం శ్రీకారం చుడుతోంది. గండిపేట స‌మీపంలో ఉన్న మంచిరేవుల పురాత‌న ఓంకారేశ్వ‌ర ఆల‌యాన్ని భారీ ఎత్తున అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. దాదాపు 700 కోట్ల రుపాయాల‌తో దేవాల‌య అభివృద్ధి ప‌నుల‌కు సీఎం రేవంత్ రెడ్డి శ‌నివారం శంకుస్థాప‌న చేయ‌నున్నారు. మూసీ పున‌రుజ్జీవ ప్రాజెక్టు తొలి విడ‌త‌లో చేపట్టేందుకు స‌ర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది.తొలివిడ‌త‌లో భూసేక‌ర‌ణ నోటీసులు జారీ చేయ‌డంతో తీవ్ర వివాదం రేగుతోంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని విప‌క్షాలు తీవ్రంగా త‌ప్పు బ‌డుతున్నాయి. అంద‌రినీ ఒప్పించి అయినా ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాల‌ని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తొలి విడ‌త‌లో భాపు ఘాట్ స‌మీపంలో భారీ గాంధీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని స‌ర్కార్ భావిస్తోంది. ఇందుకోసం భూసేక‌ర‌ణ‌తో పాటు ప్రాజెక్టుపై అంద‌రి సూచ‌న‌ల‌ను స్వీక‌రించేందుకు మంత్రుల‌తో సీఎం రేవంత్ రెడ్డి క‌మిటీని ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లతో కూడిన ఒక క్యాబినెట్ ఉపసంఘం అంద‌రి అభిప్రాయాల‌ను సేక‌రించనుంది.

పురాత‌న ప్రార్థనా స్థ‌లాల అభివృద్ధి…..

ఈ ప్రాజెక్టులో ప‌లు స‌వ‌ర‌ణ‌లు చేస్తూ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అందులో భాగంగా మంచిరేవుల గ్రామ స‌మీపంలో ఉన్న దాదాపు 800 ఏళ్ల వారసత్వం కలిగిన చారిత్రాత్మక వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణాం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. శృంగేరి శారదా పీఠం స‌హ‌కారంతో ఈ ఆల‌య నిర్మాణ ప‌నుల‌ను స‌ర్కార్ పూర్తి చేయ‌నుంది.భ‌విష్య‌త్తులో ఈ ప్రాంతం ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చాల‌న్న ల‌క్ష్యంగా దేవాల‌య స‌మీపంలో ఉన్న మూసీ నదిలో 100 అడుగుల ఎత్తైన శివుడి ఏర్పాటు చేయ‌డంతో పాటు పార్కులు, బోటింగ్ సౌకర్యాల అందుబాటులోకి తేవాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యించింది. న‌ది మ‌ధ్య నిలిచి ఉన్న భంగిమ‌లో శివుడి విగ్ర‌హాన్ని ప్రతిష్టించాల‌ని ప్ర‌భుత్వం కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసింది.
బాపు ఘాట్ స‌మీపంలో 150 మీటర్ల ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహంతో పాటు గాంధీ సరోవర్ ను , ఒక మ్యూజియం ధ్యాన కేంద్రాన్ని నిర్మంచేందుకు ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేయాల‌ని భావిస్తోంది.

మూసీ పై స‌ర్కార్ ముందుకే…….

మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఉన్న ఇత‌ర మ‌తాల ప్రార్థ‌నా స్థ‌లాల‌ను అభివృద్ధి చేయాల‌ని ప్రభుత్వం నిర్ణ‌యించింది. పురానా పూర్ స‌మీపంలో ఉన్న మ‌జీదు, గౌలి గూడ‌లో ఉన్న గురుద్వారా తో పాటు చ‌ర్చి అభివృద్ధికి కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది,మూసీ స‌మీపంలో భారీగా అభివృద్ధి ప‌నుల‌ను చేప‌ట్టి టూరీజం ప్రాంతాల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌భుత్వం దృష్టి సారించింది. మూసీ న‌దిలో స్వ‌చ్ఛ‌మైన నీటి నిల్వ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *