(న్యూస్ఇన్, హైదరాబాద్)
కాంగ్రెస్ సీనియన్ నేత టీ. జీవన్ రెడ్డి బీఆర్ ఎస్ లో చేరడం ఖరారైంది. ఇక ముహూర్తమే మిగిలి ఉంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పలికారు. పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకే కేటిఆర్ జీవన్ రెడ్డితో బేటీ అయిన అనంతరం రాజకీయ భవిష్యత్తు పై స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన గత నెలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న నేత కావడం, పార్టీ కోసం నిరంతరం పనిచేస్తారన్న గుర్తింపు ఉండడంతో…. గులాబీ పార్టీలో చేరితే జగిత్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ పార్టీని వీడిన లోటు సులువుగా భర్తీ అవుతుందని గులాబీ పార్టీ అంచనా వేస్తోంది. రాజకీయంగా సీనియర్ నేత అధికార పార్టీని వీడి ఎన్నికలకు దాదాపు రెండున్నరేళ్లు ముందుగానే ప్రతిపక్ష పార్టీలో చేరడం రాజకీయంగా కలిసి వచ్చే అవకాశం ఉందని గులాబీ నేతలు అంటున్నారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలతో ఆ పార్టీ వీడి కారెక్కితే…….రాబోయే రోజుల్లో మరింత మంది కూడా ఇదే దారిని ఎంచుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
సీనియర్ నేత కారెక్కడం ఖాయం కావడంతో…… శుక్రవారం పార్టీ అధినేత కేసిఆర్ ను ఫాం హౌస్ లో కలుపుకోనున్నారు. శుక్రవారం పార్టీ అధినేతతో కలిసి మధ్యాహ్న భోజన సమయంలో రాజకీయాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా గులాబీ పార్టీకి జీవన్ రెడ్డి చేరిక ఒక అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది.
కరీంనగర్ నేతలు..వివాదాల సృష్టి కర్తలు……

అధినేతతో భేటీ సందర్భంగా జీవన్ రెడ్డి కారెక్కే తేదీపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 27వ తేదీన పార్టీ ఆవిర్బావ దినోత్సవం ఉన్న నేపథ్యంలో అదే రోజు బహిరంగంగా పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ ఎస్ లో జీవన్ రెడ్డి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణా జిల్లాల్లో బలమైన నేతగా గుర్తింపు ఉండడంతో… ఉత్తర తెలంగాణా ప్రాంతంలోని జీవన్ రెడ్డి అనుచరులను కూడా ఒకేసారి గులాబీ పార్టీ కారెక్కించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ప్రతినిధుల సభకు మాత్రమే పరిమితం అవుతుందా బహిరంగ సభ ను నిర్వహిస్తుందా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జీవన్ రెడ్డి లాంటి నేత పార్టీలో చేరేందుకు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్నివాడుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ప్రత్యేకంగా చేరిక కోసం బహిరంగ సభ నిర్వహించేకంటే పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసే ప్రతినిధుల సభ ద్వారా చేర్చుకుని పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించే అంశాన్ని గులాబీ పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత కేసిఆర్ తో భేటీ అనంతరం దీనిపై స్పష్టత రానుంది.కరీంనగర్ లేదా జగిత్యాలలో ప్రతినిధుల సభ నిర్వహించే అవకాశం ఉంది.







Leave a Reply