(న్యూస్ఇన్, హైదరాబాద్)
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మీడియా పై ఆంక్షలు మొదలు పెట్టింది. మీడియాకు పలు ప్రభుత్వ శాఖల్లోకి వెళ్లేందుకు అనుమతి ఖచ్చితం చేస్తూ అధికారులు ఆదేశాలు అమలు చేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులు ఆ నిబందనలు ఖచ్చితంగా పాటించాలని నీటి పారుదల శాఖ నిర్ణయం తీసుకుంది. జలసౌధలోకి వెళ్లేందుకు జర్నలిస్టులకు అంతా సులువుగా సాధ్యం కాదు.

ఇక తాజాగా జలసౌధలో జర్నలిస్టుల ఎంట్రీపై ఆంక్షలు విధించడం మరో వివాదానికి దారి తీస్తోంది.అసలే తెలుగు రాష్ట్రాల మద్య జలవివాదాలు తీవ్రం అవుతుండడం…. ఏపీకి అనుకూలంగా తెలంగాణా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆంక్షలు అమలు చేయడం కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. జలసౌధలో ఉన్నతాధికారి అనుమతితోనే ఆ కార్యాలయంలోకి మీడియా ప్రతినిధులు వెళ్లాలి ఆ అధికారి ఎస్ ఎంట్రీ ….లేదంటే నో ఎంట్రీ అనే స్పష్టమైన మౌఖిక ఆదేశాలు అమలు చేస్తుండడం మీడియా ప్రతినిధుల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ నిర్ణయాలు ప్రభుత్వ పెద్దలకు తెలిసి అమలు చేస్తున్నారా….అధికారులు తమ పరిధిలో నిర్ణయం తీసుకుని ఆదేశాలు పాటించాలని కింది స్థాయి సిబ్బందికి హుకూం జారీ చేశారో స్పష్టత లేకపోయినా……ప్రభుత్వ పెద్దలు మాత్రం విమర్శలు ఎదుర్కోక తప్పడం లేదు.

మీడియాపై ఆంక్షలా ఆంటూ… గతంలో ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పరిస్థితుల్లో గతానికి భిన్నంగా మార్పు లేదు. మీడియా సమావేశాలకు హాజరైన జర్నలిస్టుల మొబైల్ ఫోన్లు, పెన్నులు కూడా సమావేశానికి ముందే తీసుకుని తమ ఉద్దేశ్యాన్ని కాంగ్రెస్ సర్కార్ మొదట్లోనే బయటపెట్టుకుంది. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఆ తరువాత సర్కార్ చూసిచడనట్లు వ్యవహరించింది. గతంలో ఉన్న నిబంధనలే ప్రస్తుతం కూడా సచివాలయంలో అమలవుతున్నాయి. అప్పట్లో జర్నలిస్టుల హక్కుల గురించి మాట్లాడిన కొంత మంది నేతలు…ఇప్పుడు బాధ్యతలు విస్మరించారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. సచివాలయంలోకి సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు విజిటర్స్ వెళ్లే సమయంలోనే జర్నలిస్టులకు అనుమతి ఎప్పటి నుంచో ఉంది. అది కూడా విజిటర్లతో పాటు ప్రత్యేకంగా పాస్ లు తీసుకుని వెళ్లి కొంత మంది సమాచారం సేకరిస్తున్నారు. మరికొంత మంది అనుమతి లేని సచివాలయంలోకి వెళ్లి ఏం చేయాలని సచివాలయానికే దూరంగా ఉంటున్నారు. మంత్రులు, కీలక అధికారులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ సమయంలో మీడియాను ఎలాంటి ఆంక్షులు లేకుండా సచివాలయంలోకి అనుమతి ఇస్తున్నారు. మీడియా ప్రతినిదులై-నా అత్యవసరంగా వెళ్లాలంటే మాత్రం సంబంధిత శాఖ నుంచి భద్రతా విభాగం అధికారులకు ఆదేశాలు అందితే తప్ప మీడియా ప్రతినిధులను సచివాలయం లోపలికి అనుమతించే పరిస్థితి లేదు.

ఇక అసెంబ్లీ పాస్ ల విషయంలోనూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. అసెంబ్లీ మీడియా కమిటీ లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చూసే బీట్ రిపోర్టర్లకు మాత్రమే అవకాశం కల్పించడంతో…. ఆ పార్టీకి అనుకూలంగా ఉంటారని గుర్తింపు ఉన్న వారికి నిబంధనల అమలులో చూసి చూడనట్లు వ్యవహరించడం …… ప్రతిపక్షాలకు సన్నిహితంగా ఉంటారని ఏ మాత్రం అనుమానం వచ్చినా…. కఠిన నిబందనలు అమలు చేసి పాస్ లు దక్కకుండా అసెంబ్లీ మీడియా కమిటీ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీకి మిత్ర పక్షంగా ఉండే మరో పార్టీకి చెందిన శాసనసభ్యుల ఆదేశాలతో పెద్ద ఎత్తున ఒక వర్గానికి చెందిన జర్నలిస్టులకు అసెంబ్లీ పాస్ లు మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంతో మంది సీనియర్లు వృత్తి రీత్యా పదవీ విరమణ పొంది స్వతంత్రంగా లేదంటే ఎదైనా సంస్థలకు ఫ్రీలాన్సింగ్ రిపోర్టింగ్ చేయాలన్నా….పాస్ లు దక్కకుండా పోతుండంతో సీనియర్ జర్నలిస్టులు సైతం అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యక్షంగా హాజరయ్యే పరిస్థితి క్రమంగా దూరం అవుతోంది. ప్రధాన మీడియా సంస్థలకు ఇచ్చే పాస్ ల విషయంలోనూ కఠినంగా కమిటీ వ్యవహరిస్తోంది. గతంలో ఇష్టాను సారంగా మీడియా పాస్ లు ఇచ్చారని, వాటిని కోత విధించాలనే విధంగా లాబీ, గ్యాలరీ, మీడియా పాయింట్ పాస్ లుగా పూర్తి స్థాయిలో వర్గీకరణ చేస్తూ… ఒక్కో సంస్థకు ఒక్కో విధంగా మీడియా పాస్ లను అసెంబ్లీ మీడియా కమిటీ ఆమోదం తెలుపుతోంది. దీనికి ఎలాంటి శాస్త్రీయ విధానం లేదు. కమిటీ నిర్ణయం మేరకే పాస్ లు దక్కితే దక్కవచ్చు…లేదంటే దక్కకపోవచ్చు.

ఇక అక్రిడెషన్ కార్డుల తంతు మూడు నెలలుగా వివాదాల మధ్య కొన-సాగుతూనే- ఉంది. 25 ఏళ్లకు పైగా జర్నలిస్టుగా అనుభవం ఉన్నా…… ప్రభుత్వ విధించిన నిబందనలతో అలాంటి వారికి కూడా అక్రిడేషన్లు దక్కకుండా పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.అర్హులందరికీ అక్రిడేషన్ ల మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు చెబుతున్నా…ఆచరణలో ఎంతవరకు సాధ్యం అన్న అనుమానాలు అందరినీ వెంటాడుతున్నాయి. అక్రిడేషన్ కార్డుల వ్యవహారం వివాదాస్పదం కావడంతో కొంత మంది న్యాయ స్థానం తలుపు తట్టారు. గత ప్రభుత్వ హాయంలో ఇచ్చిన కంటే అధికంగా అక్రిడేషన్ కార్డులను మంజూరు చేస్తామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు అర్హులైన జర్నలిస్టులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడంపైనా దృష్టి పెట్టాలి. గత ప్రభుత్వ హాయంలో దాదాపు 30 వేల అక్రిడేషన్ కార్డులు జారీ అయ్యాయని,తమ అంచనా ప్రకారం ప్రజా ప్రభుత్వం 44 వేల అక్రిడేషన్ కార్డులు ఇవ్వనున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అయితే రాష్ట్రంలో అక్రిడేషన్ల సంఖ్య ఈ స్థాయిలో ఏ ప్రాతిపదికన మంజూరు చేస్తారో చూడాల్సిన అవసరం ఉన్నది.
అక్రిడేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం స్వాగతించదగ్గ పరిణామమే…… ఈ వ్యవహారం కొన్ని సంస్థలకు కాసుల పంట పండిస్తోంది. గతంలో లేని విధంగా అక్రిడేషన్ల కోసం ప్రభుత్వం విధించిన నిబంధనలతో కొత్త డిమాండ్లు అమలు చేయడం మొదలు పెట్టాయి. కొంత మంది తప్పని పరిస్తితుల్లో ఆ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని అక్రిడేషన్లు పొందే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రభుత్వ నిబంధనలు ఇలాంటి వారికి అడ్డుకట్టే వేసే విధంగా ఉంటే ఎంతో మంది అర్హులకు న్యాయం జరుగుతుంది. సంస్థలు ఇచ్చే జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకే దక్కేలా నిబందనలు అమలు చేస్తే తప్ప ఇలాంటి వారికి చెక్ పెట్టే అవకాశం దాదాపు లేదు.








Leave a Reply