NewsInn

News in a Click

సీఎంతో చ‌ర్చిస్తా… నిధులు తెస్తా – జగ్గారెడ్డి

(మెద‌క్,న్యూస్ఇన్‌)

సంగారెడ్డి ,సదాశివపేట మున్సిపాలిటీ ల పరిధి లో అన్ని పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్ళ లో భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా, పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా జగ్గారెడ్డి, నిర్మల సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నెలలో కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా, శుక్రవారం డిఆర్ఓ పాండు సమక్షంలో స‌మీక్ష‌ సమావేశాన్ని నిర్వహించారు.
అదనపు తరగతి గదులు, హాస్టల్ వసతి కోసం ప్రత్యేకంగా భవనాలు, స్కూళ్లు, కాలేజీల్లో టాయిలెట్స్, మెరుగైన నీటి వసతి, అవసరమైన ఇతరత్రా అన్ని సదుపాయాలు కల్పించడం కోసం రూపొందించిన నిధుల ప్రతిపాదనలపై చర్చించారు. ప్రధానంగా తారా డిగ్రీ కళాశాల, బాలికల జూనియర్ కళాశాల, ఉమెన్స్ డిగ్రీ కళాశాల, బాయ్స్ హై స్కూల్ లలో అదనపు తరగతి గదులు, మూత్రశాలలు, విద్యార్థులు ఉండేందుకు తగినన్ని హాస్టల్ గదులు తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు.

భవిష్యత్తులో విద్యార్థుల సంఖ్య పెరిగే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అందుకు తగినట్లుగా నూతన భవనాలను నిర్మించాలని ఈ సందర్భంగా జగ్గారెడ్డి అధికారులకు సూచించారు. నిధుల విషయంలో సంకోచించాల్సిన అవసరం లేదని, విద్యార్థులకు ప్రయోజనం దక్కడమే ముఖ్య విషయమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా మరోసారి ప్రతి విద్యా సంస్థ వారీగా ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు.ముఖ్యమంత్రిని అడిగి తాను అవసరమైనన్ని నిధులు తెప్పిస్తానని ఈ సందర్భంగా జగ్గారెడ్డి తెలిపారు. దాంతో పాటు సి ఎస్ ఆర్ నిధులు కూడా వీలైనంత ఎక్కువ తెప్పించేందుకు సమీక్ష సమావేశం నుంచే ఆయన అరబిందో, ఎమ్మెస్ ఎన్, యుబి తదితర కంపెనీల పెద్దలతో ఫోన్లో మాట్లాడారు. ఆయా కంపెనీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

ప్రతి ప్రభుత్వ పాఠశాల, కళాశాల, హాస్టల్ వసతి.. ఇలా ఒక్కో విద్యాసంస్థకు సంబంధించి అవసరమైన నిధుల ఎస్టిమేషన్లను సిద్ధం చేయాలని జగ్గారెడ్డి, నిర్మల ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.ఈనెల 25న మరోమారు సమావేశమై ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలపై చర్చించి త్వరితగతిన నిధులు మంజూరు చేయిస్తానని జగ్గారెడ్డి, నిర్మల తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *