(అమరావతి, న్యూస్ఇన్)
పాఠశాలలు పునః ప్రారంభం నాటికి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లన్నీ పూర్తి వసతులతో సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతీ హాస్టల్ గాడిలో పడాలని… అన్ని రకాల వసతులు ఉండాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కనుంచి క్షేత్రస్థాయిలో వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”జూన్ లో స్కూళ్ల రీ-ఓపెనింగ్ నాటికి హాస్టళ్లు అన్నీ చక్కగా ఉండాలి. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండాలి. టాయిలెట్లు.. ఆర్వో ప్లాంట్లు సిద్దంగా ఉండాలి. హాస్టళ్లకు సంబంధించి వసతులపై ఎలాంటి ఫిర్యాదులు కూడా రాకూడదు. హాస్టళ్లల్లో వసతులు మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించాం. సాస్కీ నిధులతో ఈ పనులు చేపడుతున్నాం. నిధులు అందించిన తర్వాత కూడా ఇంకా ఫిర్యాదులు వస్తే అది అధికారుల తప్పిదమే అవుతుంది. వసతులను ఏర్పరచడమే కాకుండా… వాటిని సక్రమంగా నిర్వహించేలా కూడా చూడాలి. ఈ మేరకు నిరంతర పర్యవేక్షణ చేపడుతూనే ఉండాలి. హాస్టళ్లలో ఆహారం, నీటి సరఫరా విషయంలో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు… పారిశుద్ధ్యం విషయంలో తేడా రాకుండా చూసుకోవాలి. ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాస్టళ్లను నిరంతరం తనిఖీలు చేస్తూ ఉండాలి. ఇక నగరాలు, పట్టణాల్లో మౌళిక సదుపాయాల్లో ఎలాంటి లోపాలూ కన్పించకూడదని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, వీధి లైట్లు, డ్రైనేజీ, చెత్త సేకరణ వంటి అంశాల్లో ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించే మెకానిజం ఉండాలి. పని పూర్తి చేశాక స్థానికుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఫిర్యాదు చేసిన వెంటనే ప్రభుత్వం స్పందించింది… మున్సిపల్ అధికారులు స్పందించారనే భావన ప్రజలకు కలిగేలా చేయాలి. మున్సిపల్ కమిషనర్లకు స్పష్టమైన గైడ్ లైన్స్ జారీ చేయాలి.

మహిళల భద్రత అత్యంత ప్రాధన్యత…..
మహిళలపై నేరాల విషయంలో ఏ మాత్రం అలక్ష్యం వద్దు. మహిళల జోలికి రావాలన్నా.. అఘాయిత్యం చేయాలనే ఆలోచన రావాలన్నా ఒణికి పోయే పరిస్థితి తీసుకురావాలి. సంక్షేమం, అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులకు ఎంతటి ప్రాధాన్యతనిస్తున్నామో.. దానికి పదింతల ప్రాధాన్యత మహిళలు, చిన్నారుల భద్రతకు ఇస్తున్నాం. శాంతి భద్రతలను పాటించే విషయంలో నేరాలను కట్టడి చేసే సందర్భంలో ఏ మాత్రం రాజీ పడొద్దు. తప్పు చేసిన వారిని త్వరితగతిన అరెస్ట్ చేయడమే కాదు… వారికి శిక్షలు పడేలా చూడాలని సీఎం చంద్రబాబు అన్నారు. గంజా, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాల ప్రభావం కన్పించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.











Leave a Reply