NewsInn

News in a Click

సినీ సంగీత చరిత్రపై బాలు ది చెరగని సంతకం

సినీ సంగీత చరిత్రపై బాలు ది చెరగని సంతకం

సంగీతానికి ఎల్లలు లేవని నిరూపించిన స్వర మాంత్రికుడు

‘ఎస్పీ బాలు ’ విగ్రహావిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు

(హైదరాబాద్, న్యూస్ఇన్)

భారతీయ సినీ సంగీత చరిత్రపై చెరగని సంతకం ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. భారతీయ 14 భాషల్లో… 40వేలకు పైగా పాటలు పాడి, పాటకు ఎల్లలులేవని నిరూపించిన స్వర మాంత్రికుడు అని కొనియాడారు. తరాలు మారినా, ఆయన పాట నిత్యనూతనంగా ప్రతీ తెలుగు హృదయాన్ని తట్టి లేపుతూనే ఉంటుందన్నారు. ‘ది మ్యూజిక్ గ్రూప్ హైదరాబాద్’ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడితో కలిసి సోమవారం లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… సంగీత ప్రపంచంలో రారాజుగా… పాటల పల్లకిలో నెలరాజుగా… అమర గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనందరి గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు.

కేవలం గాయకుడిగా మాత్రమే కాదు… నటుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా మనల్ని అలరించారన్నారు. తెరపై కనిపించే నటులే పాడుతున్నారా అని అనిపించేలా పాడటం ఆయనకు మాత్రమే సాధ్యమయ్యిందన్నారు. ఆయన గొంతులో పలికిన ప్రతి పాటలో ఒక భావం, ఒక జీవం ఉండేదన్నారు. నూతన కళాకారులను ప్రోత్సహించడంలో, కొత్త సంగీత పోకడలను స్వాగతించడంలో ఎప్పుడూ ముందుండేవారన్నారు. ఈ రోజు మనం ప్రారంభించుకున్నది కేవలం విగ్రహం మాత్రమే కాదని, అది సంగీతానికి, నిబద్ధతకు, వినయానికి ప్రతీక అన్నారు. అపారమైన సంగీత సంపదను, ఆయన పాటించిన ఉన్నతమైన విలువలను అది మనకు నిరంతరం గుర్తు చేస్తుందన్నారు. కళలను ప్రోత్సహించేందుకు, కళాకారులను గౌరవించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహ ఏర్పాటుపై కొంతమంది తెలంగాణ వార్డులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తతల మధ్య పూర్తయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావలసి ఉన్న…. వివాదం చోటు చేసుకుంటుందన్న అనుమానంతో సీఎం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *