NewsInn

News in a Click

కన్హా శాంతివనం వివరాలివ్వండి

కన్హా శాంతివనం వివరాలివ్వండి

షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు దరఖాస్తు

సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు అందజేయండి

(హైద‌రాబాద్, న్యూస్ ఇన్‌)

క‌న్హా శాంతి వ‌నం ఇటీవ‌ల ఈ పేరు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. కార‌ణం ఇక్క‌డికి ఏదో సంద‌ర్బంలో ప్ర‌ముఖ నేత‌లు సంద‌ర్శించ‌డం శాంతి వ‌నం అధ్బుతంగా ఉంద‌ని పొగ‌డ్త‌లు గుప్పించ‌డంతో బ‌య‌టి ప్ర‌పంచానికి శాంతివ‌నం పై ఆస‌క్తి పెరుగుతోంది. దీని నిర్మాణం పూర్త‌యి ప్రారంభ‌మ‌య్యే వ‌ర‌కు కూడా దీని గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి పెద్ద‌గా తెలియదు…ఇది ఒక వైపు మాత్ర‌మే….మ‌రోవైపు శాంతి క‌న్హా వ‌నం నిర్వ‌హాకులు భారీ విస్తీర్ణంలో నిర్మాణం చేయ‌డంతో…. ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలు ఆక్ర‌మించి ప్ర‌హ‌రీ గోడ‌లు నిర్మించార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. స్థానికులు క‌న్హా వ‌నం గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయినా….. ఈ ఆశ్ర‌మానికి ప్ర‌ముఖులు వ‌స్తుండ‌డం…… అంత‌ర్జాతీయ స్థాయిలో కార్య‌క్రమాలు నిర్వ‌హిస్తుండ‌డంతో ఆశ్ర‌మంలో జ‌రిగే కార్య‌క్ర‌మాలపై కూడా ఆస‌క్తి పెరుగుతోంది.

ఆశ్ర‌మం సేవ‌, ధ్యానం పేరుతో ఏర్పాటైనా….ఇక్క‌డ మొత్తం వ్యాపారంగానే ఉంటుంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో క‌న్హా శాంతి వ‌నంపై షాద్ న‌గ‌ర్ మాజీ ఎమ్మెల్యే బ‌క్క‌ని న‌ర్సిములు స‌మాచార హ‌క్కు చ‌ట్టం ప్ర‌యోగించ‌డం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది.నందిగామ మండలంలోని చేగూరు గ్రామ పరిధిలోని చెరువులు, కుంటలతో పాటుగా వాటర్ షెడ్ ద్వారా గతంలో చేసిన పనులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపాలని కోరుతూ షాద్ నగర్ నీటి పారుదల శాఖ అధికారులకు దరఖాస్తు చేశారు. కాకతీయుల కాలంలో ప్రజల తాగు, సాగు నీటి కోసం చెరువులు, కుంటలు తవ్వగా మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు హయాంలో ప్రత్యేకంగా నీరు – మీరు కార్యక్రమం ద్వారా వాటర్ షెడ్ లను మంజూరు చేసి చెక్ డ్యామ్ లు, పాటు కాలువలను పునరుద్ధరించారని, జన్మభూమి కార్యక్రమం ద్వారా చెరువుల్లో పూడికతీత పనులు చేసి భూగర్భ జలాలు పెంచడం జరిగిందని ఈ కార్యక్రమాల్లో అప్పటి ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు సైతం పాల్గొన్నట్లు దరఖాస్తులో మాజీ ఎమ్మెల్యే బక్కని ప్రస్తావించారు.

చెరువులు కుంటలు గల గ్రామంగా పేరు పొందిన చేగూరు గ్రామంలో ప్రస్తుతం పాటు కాలువలు, చెరువులు, కుంటల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందనీ పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం కన్హా శాంతివనంలోని భూముల వివరాలు సేకరించగా అందులో చెరువులు, కుంటలు ఉన్నట్లుగా స్పష్ట మవుతుందన్నారు. కన్హా శాంతివనం చుట్టూ ప్రహరీ గోడలు ఏర్పాటు చేయటంతో ప్రస్తుతం అక్కడ ఉన్న చెరువులు, కుంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉన్నందున చేగూరు గ్రామంతో పాటు కన్హా శాంతివనంలోని చెరువులు, కుంటల వివరాలు ఇవ్వడంతో పాటు వాటి సంరక్షణకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారో తెలియ‌చేయాల‌ని కోరారు. చెరువులు, కుంట‌లను ప్రైవేటు వ్య‌క్తులు లేదా సంస్థ‌లు నిర్వ‌హించే ప్రాంతంలో ఎలా ఉంటాయో అన్న చ‌ర్చ కూడా ఉంది. మొత్తం మీద బ‌క్క‌ని న‌ర్సింహులు స‌మాచార హ‌క్కు కింద ద‌ర‌ఖాస్తు చేయ‌డం ఇప్పుడు ఎన్నో అనుమానాల‌కు తావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *