NewsInn

News in a Click

సైబర్ మోసగాళ్లు వల వేస్తారు..జాగ్రత్త

సైబర్ మోసగాళ్లు వల వేస్తారు..జాగ్రత్త

సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరిక

క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల వేళ

(హైదరాబాద్,న్యూస్ ఇన్)

రాబోయే క్రిస్మస్,నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి. అరవింద్ బాబు ఒక ప్రకటనలో హెచ్చరించారు. పండుగ ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.సైబర్ నేరగాళ్లు అనుసరించే మోసపూరిత పద్ధతులు అనుసరించే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

• నకిలీ ఈవెంట్ & పార్టీ పాస్‌లు: న్యూ ఇయర్ పార్టీలు, కచేరీలు, పబ్‌లు మరియు రిసార్ట్‌ల పేరుతో నకిలీ వెబ్‌సైట్ల ద్వారా తక్కువ ధరకు పాస్‌లు అమ్ముతూ మోసం చేస్తారు.

• ట్రావెల్ & హాలిడే ప్యాకేజీలు: విదేశీ పర్యటనలు, క్రూయిజ్ టూర్లు మరియు హాలిడే ప్యాకేజీల పేరుతో భారీ ఆఫర్లు ప్రకటించి, అడ్వాన్స్ డబ్బులు వసూలు చేసి అదృశ్యమవుతారు.

• గిఫ్ట్ & లక్కీ డ్రా స్కామ్స్: మీకు క్రిస్మస్ బహుమతి లేదా లాటరీ తగిలిందని వాట్సాప్, ఎస్సెమ్మెస్ ద్వారా లింకులు పంపి, “ప్రాసెసింగ్ ఫీజు” పేరుతో డబ్బులు కాజేస్తారు.

• నకిలీ డొనేషన్లు: అనాథాశ్రమాలు, చర్చిలు లేదా ఛారిటీల పేరుతో నకిలీ యూపీఐ (UPI) ఐడీలు సృష్టించి విరాళాల పేరిట దోచుకుంటారు.

• హోటల్ బుకింగ్ ఫ్రాడ్: పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్‌లు బుక్ చేస్తామని నమ్మించి నకిలీ వెబ్‌సైట్ల ద్వారా అడ్వాన్స్ పేమెంట్లు తీసుకుంటారు.

• పార్ట్-టైమ్ జాబ్ ఆఫర్లు: పండుగ సీజన్‌లో ఈవెంట్ మేనేజ్‌మెంట్, డెలివరీ పనులంటూ నకిలీ ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి రిజిస్ట్రేషన్ ఫీజుల పేరుతో మోసగిస్తారు.

ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు

• అపరిచిత వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దు, తెలియని ఏపీకే (APK) ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దు.

• మీ బ్యాంక్ వివరాలు, OTP, PIN, CVV నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దు.

• ఆఫర్లు, పార్టీ పాస్‌లు లేదా బుకింగ్‌లను కేవలం అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే నిర్ధారించుకోండి.

• తెలియని QR కోడ్లను స్కాన్ చేయవద్దు, గుర్తుతెలియని యూపీఐ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దు.

• ముఖ్యమైన ఖాతాలకు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఎనేబుల్ చేసుకోండి.

• ముఖ్యంగా వృద్ధులు, యువత సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండాలి.

ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని డీసీపీ సూచించారు. స్క్రీన్ షాట్లు, లావాదేవీల వివరాలు మరియు ఫోన్ నంబర్లను ఆధారాలుగా భద్రపరుచుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *