ఏలేటి మహేశ్వర్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పాలనను ప్రజలు తిరస్కరించారనేందుకు నిదర్శనంగా నిలిచాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ఫలితాల ద్వారా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి పెద్ద ఎత్తున వ్యక్తమవుతోందన్నారు.గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన అవినీతిలో మునిగిపోయిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమై, ఆరు గ్యారంటీలు, 420 హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గాడి తప్పించిందని ఆరోపించారు.రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, తక్షణమే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అలాగే మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించాలి. అప్పుడు ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టంగా బయటపడుతుంది.రాష్ట్ర అభివృద్ధిని విస్మరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు మున్సిపల్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.

నిర్మల్ నియోజకవర్గంలో 128 పంచాయతీలకు గాను 80 పంచాయతీల్లో బీజెపి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారన్నారు. ముధోల్ నియోజకవర్గంలో ని 178 గ్రామ పంచాయతీలకు గాను 98 గ్రామ పంచాయతీల్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా నిర్మల్ జిల్లాకు చెందిన నాలుగు మండలాల్లో బీజేపీకి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఖానాపూర్ నియోజకవర్గంలో 36 గ్రామ సర్పంచులను బీజేపీ మద్దతుతో గెలిపించారని చెప్పారు. నిర్మల్ జిల్లాలో 213 మంది గ్రామ సర్పంచులను భారతీయ జనతా పార్టీ మద్దతుతో ప్రజలు గెలిపించారు. ఈ ఫలితాలను పరిశీలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజెపి పార్టీకి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలని మహేశ్వర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.







Leave a Reply