కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగే కుసంస్కారిని కాను
కాంగ్రెస్ హనీమూన్ ముగిసింది….ఇక పోరు బాటే
కాంగ్రెస్, బీజెపి మధ్య చీకటి బంధం
(హైదరాబాద్,న్యూస్ ఇన్)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ లు ఎవరితో ఆడినా తమకు సంబంధం లేదని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు చేయాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు. తన మనువడితో కలిసి దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీతో సీఎం రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడడంపై కేటీఆర్ స్పందించారు. రాజకీయాల్లో తమ ఫైట్ రేవంత్ రెడ్డితోనే కానీ ఆయన కుటుంబ సభ్యులతో కాదని కేటిఆర్ స్పష్టంచేశారు. కుటుంట సభ్యులను రాజకీయాల్లోకి లాగే అంత కుసంస్కారిని తాను కాదన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన మనవడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు బాగుండాలని ప్రార్థిస్తానని కేటీఆర్ తెలిపారు.తమ అధినేత కేసిఆర్ సూచనలకు అనుగుణంగా తాము నడుచుకుంటామన్నారు. అస్సాం ముఖ్యమంత్రి రాహూల్ గాంధీ గురించి చేసిన వ్యాఖ్యలను కేసిఆర్ ముందుగా ఖండించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో శనివారం మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసిందని, ఇకపై కేసీఆర్ నేరుగా ప్రజల్లోకి వచ్చి పోరాటం చేస్తారని ప్రకటించారు.నగరాన్ని మూడు ముక్కలు చేయాలనే రేవంత్ రెడ్డి ఆలోచన అశాస్త్రీయమని, వార్డుల విభజన ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జరుగుతోందన్నారు.తాను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న హయాంలో పార్టీ మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందని, కానీ రేవంత్ రెడ్డివి అన్ని ఓటములేనని ఎద్దేవా చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. అందుకే 23% ఉన్న రిజర్వేషన్లను పంచాయతీ ఎన్నికల్లో 17 శాతానికి తగ్గించిందని మండిపడ్డారు
కాంగ్రెస్ – బీజేపీల మధ్య ‘చీకటి స్నేహం’
కాంగ్రెస్ మరియు బీజేపీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీలో బీజేపీ ఎంపీ దూబే గృహప్రవేశానికి రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్లారో బీజేపీ నాయకుడు రామచంద్రరావు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్లో రేవంత్ రెడ్డి నివాసాన్ని రీమోడల్ చేయించింది ఒక బీజేపీ ఎంపీయేనని వెల్లడించారు. సీఎం రమేష్ వంటి వారికి రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు ఇస్తుంటే, బీజేపీ ఆయనకు అండగా నిలుస్తోందని ఆరోపించారు.
తెలంగాణకే ఒక్క రూపాయి కూడా అదనంగా తేలేని కిషన్ రెడ్డితో మాకేం లాభం ఉంటుందని ప్రశ్నించారు. అందుకే ప్రధానమంత్రి కూడా బీజేపీ నేతలకు తలంటి పోసినట్లు వార్తలు వచ్చాయన్న అంశాన్ని ప్రస్తావించారు.

కేసీఆర్ దిశానిర్దేశం – పార్టీ భవిష్యత్తు కార్యాచరణ
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ‘హనీమూన్ పీరియడ్’ ముగిసిందని, ఇకపై కేసీఆర్ గారు నేరుగా ప్రజల్లోకి వస్తారని కేటీఆర్ ప్రకటించారు. రేపు జరిగే రాష్ట్ర స్థాయి సమావేశంలో కేసీఆర్ గారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపైన రేపటి సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామన్నారు.
డివిజన్ల డీలిమేటేషన్ స్పష్టత లేదు….
గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపాలిటీల విలీనం సక్రమంగా జరగలేదని, గ్రేటర్ ను మూడు కార్పొరేషన్లు చేయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన అని కేటీఆర్ విమర్శించారు. చిన్న మున్సిపాలిటీలను పెద్ద మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్లలో కలిపే అంశంపై స్థానిక ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదన్నారు. మరోవైపు వార్డుల విభజన కూడా అశాస్త్రీయంగా, అడ్డగోలుగా జరిగిందన్నారు. కేవలం ఒక గదిలో కూర్చుని విభజన చేసినట్లు కనిపిస్తోందని, ఎందుకంటే ఒక్కొక్క వార్డులో అత్యంత తక్కువ జనాభా ఉంటే, మరొక వార్డులో భారీగా ఓటర్లు ఉన్నారన్నారు.హైదరాబాద్ నగర విభజన అంశం ప్రజలకు, పార్టీలకు, ప్రభుత్వ అధికారుల కన్నా ముందే రేవంత్ రెడ్డి మిత్రులకు ముందుగా సమాచారం తెలిసిపోతుందన్నారు.

పార్టీ గుర్తుల ఎన్నికలకు సర్కార్ వెనుకడుగు….
స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసిన తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాహసించడం లేదని కేటీఆర్ అన్నారు. అందుకే వెంటనే పెట్టాలనుకున్న ఎన్నికలను సుదీర్ఘంగా వాయిదా వేసుకుంటున్నట్లు పరోక్షంగా ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తాము గెలుచుకున్న స్థానాల సంఖ్యను పెంచుకునేందుకు.. కాంగ్రెస్ రెబల్స్ ని, ఇండిపెండెంట్లను కూడా తమ అభ్యర్థులుగా చూపించుకుని జాబితా విడుదల చేశారని ఎద్దేవా చేశారు.అనేక మంది మంత్రుల సొంత నియోజకవర్గాల్లోని మేజర్ గ్రామ పంచాయతీలను తమ పార్టీ అభ్యర్థులు దక్కించుకున్నారని తెలిపారు.







Leave a Reply