త్వరలో చట్టం తెస్తాం
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఇతర మతాలను కించపరిచేలా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టం తెస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సమాజంలో ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించుకుంటూ శాంతిని కాపాడుకోవలసిన అవసరం ఉందని, ఇతర మతాలను కించపరిచే వారిని శిక్షించే విధంగా వచ్చే శాసనసభ సమావేశాల్లో చట్టం చేస్తామని అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు క్రిస్టియన్ పెద్దల సమక్షంలో కేక్ కట్ చేశారు. క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి గారు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మత ప్రాతిపదికన దాడులకు పాల్పడితే ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. అలాంటి ఘటనలను ప్రభుత్వం కఠినంగా అణిచివేసిందని, అన్ని మతాలకు సమాన హక్కును స్వేచ్ఛను కల్పిస్తామని అన్నారు. “శాంతిని ఇవ్వాలి, ప్రేమను పంచాలన్న ఏసు ప్రభువు ఇచ్చిన గొప్ప సందేశం స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. ఏసు ప్రభువు స్ఫూర్తితో తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు శాంతిని, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తోంది. మానవ సేవయే మాధవ సేవ అని భావించి ప్రేమను పంచాలని, శాంతిని పెంచాలని ఏసు క్రీస్తు చాటారు. ఏసు క్రీస్తు జన్మించిన డిసెంబర్ నెల ప్రభువు ఆరాధకులకు మాత్రమే కాదు. తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్కు కూడా ఒక మిరకిల్ (అద్భుతమైన) మాసం. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా ప్రకటన వెలువడటమే కాకుండా ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కూడా డిసెంబర్ నేలలోనే అని సీఎం చెప్పారు. క్రిస్టియన్ మిషనరీలు విద్య, వైద్యం ప్రాధాన్యతను గుర్తించి పేదలకు ఎంతో అంకిత భావంతో, ప్రభుత్వంతో పోటీ పడి పేదలకు ఉదాత్తమైన సేవలు అందిస్తున్నాయి.


Leave a Reply