NewsInn

News in a Click

ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు నిరంత‌ర ప్ర‌క్రియ‌

మ‌రో మూడు విడ‌త‌ల్లో ఇళ్లు ఇస్తాం

మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

రాష్ట్రంలో అర్హులైన పేద‌ల‌కు ఇళ్లు మంజూరు చేయ‌డం నిరంత‌రం కొన‌సాగిస్తామ‌ని ఒక‌టి, రెండు విడ‌త‌ల‌తో ఆగిపోద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్ల‌డించారు. మ‌రో మూడు విడ‌త‌లుగా ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. గ‌త ప్ర‌భుత్వంలాగ ఎన్నిక‌లప్పుడే ఇండ్ల గురించి హామీలు ఇవ్వ‌కుండా తాము చిత్త‌శుద్దితో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నామ‌న్నారు. ప్ర‌తి సంవ‌త్స‌రం మార్చి- ఏప్రిల్ నెల‌ల కాలంలో ఇండ్ల‌ను మంజూరు చేస్తామ‌న్నారు. శ‌నివారం శాస‌న‌స‌భ‌లో ప‌లువురు శాస‌న‌స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి పొంగులేటి స‌మాధానాలు ఇచ్చారు. ఇప్ప‌టికే తొలి విడ‌త‌గా మంజూరు చేసిన 4.50 ల‌క్ష‌ల ఇండ్ల‌లో సుమారు 3ల‌క్ష‌ల ఇండ్లు వివిధ నిర్మాణ ద‌శ‌ల్లో ఉన్నాయ‌ని, సుమారు 52వేల ఇండ్లు గృహ‌ప్ర‌వేశానికి సిద్దంగా ఉన్నాయ‌ని తెలిపారు. వ‌చ్చే వ‌ర్షాకాలంలోగా తొలివిడ‌త మంజూరైన ఇండ్ల నిర్మాణం పూర్త‌వుతుంద‌న్నారు. మ‌రో మూడువిడ‌త‌లుగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. గ‌త ప్ర‌భుత్వం 2 బిహెచ్‌కే ఇండ్ల‌ను నిర్మించి ఎవ‌రికీ కేటాయించ‌లేద‌ని, అసంపూర్తి ఇండ్ల కోసం 455 కోట్ల రూపాయిలు మంజూరు చేశామ‌ని వీటిని కూడా అర్హుల‌కు అంద‌జేస్తామ‌ని వెల్ల‌డించారు. గ‌త ప్ర‌భుత్వంలోని పెద్ద‌మ‌నిషి హామీ ఇచ్చి వ‌దిలేసిన వాసాల‌మ‌ర్రిలో కూడా తామే ఇండ్లు నిర్మిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో యుద్ద‌ప్రాతిప‌దిక‌న 2బిహెచ్‌కే ఇండ్ల నిర్మాణం, మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, ప్ర‌జాప్ర‌తినిధుల సూచ‌న‌ల అమ‌లు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. జిహెచ్ఎంసీ ప‌రిధిలో గృహ‌నిర్మాణానికి స్ద‌లాల‌ను గుర్తించి మంజూరు చేస్తామ‌న్నారు. ఉమ్మ‌డి జిల్లాల ప‌రిధిలో ఇండ్ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌మావేశాలు ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 వారీగా గుర్తిస్తామ‌ని, రాష్ట్రంలో ఇప్ప‌టికే 20 ల‌క్ష‌ల మందిని గుర్తించామ‌ని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సిద్దంగా ల‌భ్య‌మ‌య్యే స్ధ‌లాల‌ను గుర్తిస్తే వాటిని నిరుపేద‌ల‌కు ఇండ్ల స్ధ‌లాలుగా మంజూరు చేస్తామ‌ని అన్నారు. సింగ‌రేణి ప్రాంతంలో ఇండ్ల ప‌ట్టాల పెండింగ్ స‌మ‌స్య‌ను కూడా క్యాబినెట్‌లో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వానికి ఎన్ని ఆర్దిక ఒడుదుడుకులు ఉన్నా అర్హులైన పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణం జ‌రుగుతుంద‌ని మంత్రి వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *