NewsInn

News in a Click

పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం – టామ్‌కాందే బాధ్య‌త‌

పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం – టామ్‌కాందే బాధ్య‌త‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

విదేశాల్లో ఉద్యోగాల‌కు అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ‌, ఉద్యోగ మేళాల‌తో పాటు ఉద్యోగార్ధుల‌కు అవ‌స‌ర‌మైన పాస్‌పోర్టు, ఆయా దేశాల్లో వారికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించే బాధ్య‌త‌ను టామ్‌కాం తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. శ‌క్తి శాఖ‌పై ఆ శాఖ మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామితో క‌లిసి సీఎం రేవంత్ రెడ్డి శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఉత్త‌ర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్య‌లో కార్మికులు మ‌ధ్య ప్రాచ్య దేశాల‌కు వెళుతుంటార‌ని, ఈ క్ర‌మంలో వారు ఏజెంట్ల చేతిలో మోస‌పోయి ఇబ్బందిప‌డుతున్నార‌ని సీఎం తెలిపారు. ఉపాధి నిమిత్తం విదేశాల‌కు వెళ్లే వారికి పాస్‌పోర్టులు ఇప్పించ‌డంతో పాటు వారు వెళ్లే దేశాల్లోని మ్యాన్ ప‌వ‌ర్ కంపెనీల‌తో ఒప్పందాలను టామ్‌కాం చేసుకోవాల‌ని సీఎం సూచించారు. విదేశీ కంపెనీల‌తో టామ్‌కాం ఒప్పందం చేసుకోవ‌డం ద్వారా అక్క‌డకు వెళ్లిన వారికి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి, వారికి న్యాయం చేయ‌డానికి వీలుంటుంద‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. కార్మికుల‌ను విదేశాల‌కు త‌ర‌లించే ఏజెంట్ల వివ‌రాలు సేక‌రించి.. వారు పంపించే ప్ర‌తి వ్య‌క్తి వివ‌రాలు న‌మోదు చేయాల‌ని సీఎం సూచించారు. ఈ వ్య‌వ‌హారాల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు టామ్‌కాంకు మాజీ ఐఎఫ్ఎస్ అధికారిని సీఈవోగా నియ‌మిస్తామ‌ని సీఎం తెలిపారు. ఉద్యోగార్దుల‌కు లైట్ మోటార్ వెహిక‌ల్‌, హెవీ మోటార్ వెహిక‌ల్ డ్రైవింగ్‌లోనూ శిక్ష‌ణ ఇప్పించాల‌ని సీఎం సూచించారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీలో నూతన ఆవిష్కరణలకు అవసరమైన రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జ‌ర్మనీ, జ‌ప‌నీస్‌, కొరియ‌న్‌, చైనీస్‌, ర‌ష్య‌న్ త‌దిత‌రు భాష‌లు నేర్చుకునేందుకు వీలుగా స్కిల్ యూనివ‌ర్సిటీలో ప్ర‌త్యేక విభాగాన్ని నెల‌కొల్పాల‌న్నారు. విదేశీ భాష‌లు నేర్పేందుకు స్థానికంగా ఆ భాష‌లో ప‌ట్టున్న వారితో పాటు ఆయా దేశాల‌కు చెందిన శిక్ష‌కుల‌ను ర‌ప్పించాల‌ని సీఎం అన్నారు. ప్రభుత్వ ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు, ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాల‌ల్లో చదివే విద్యార్థులకు పెద్ద కంపెనీల్లో ఇంట‌ర్న్‌షిప్ చేసే అవ‌కాశం క‌ల్పించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓ వైపు చ‌దువుకుంటూనే, మ‌రో వైపు ఇంట‌ర్న్‌షిప్ చేయ‌డం ద్వారా వారికి స్టైఫండ్ ల‌భిస్తుంద‌ని, భ‌విష్య‌త్‌లో చేయ‌బోయే ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకుంటార‌న్నారు. ఏటీసీల్లో EV సర్వీసులకు సంబంధించిన కోర్సులు, డ్రోన్ టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టాల‌ని సీఎం సూచించారు. ఈవీల వాడ‌కం విప‌రీతంగా పెరిగిన నేప‌థ్యంలో వాటి సర్వీసింగ్ చేయ‌గ‌లిగిన వారు అవ‌స‌ర‌మ‌న్నారు. వ్య‌వ‌సాయంలో డ్రోన్ల వినియోగం భారీగా పెరుగుతున్నందున డ్రోన్ టెక్నాల‌జీ కోర్సు ఉండాల‌ని సీఎం సూచించారు.

,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *