(హైదరాబాద్, న్యూస్ఇన్)

బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చిన తరువాత కేసులు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈకేసు విచారణ కోసం ప్రత్యేకంగి సిట్ ను ఏర్పాటు చేసింది. సిద్దిపేటకు చెందిన నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో హరీష్ రావ్ పై ట్యాపింగ్ కేసును పంజాగుట్ట పోలీసులు గతంలో నమోదు చేశారు.ఈ కేసును హై కోర్టు గతంలో కొట్టి వేసింది. హై కోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టకు వెళ్లి హరీష్ రావ్ ను విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఇక్కడా విఫలమైంది. సోమవారం సుప్రీంకోర్టు కూడా హై కోర్టు తీర్పును సమర్ధించింది. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు సరైన ఆధారాలు లేవని వ్యక్తం చేసిన హై కోర్టు అభిప్రాయంతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్పై విచారణ కొనసాగుతోందని, దీనికి సంబంధించి కీలక ఆధారాలు ఉన్నందున హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు, ప్రభుత్వం సమర్పించిన వాదనలతో విభేదించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకు ఎటువంటి సంబంధం లేదని గతంలోనే హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో, ఇకపై ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఈ తీర్పుతో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుపై ఉన్న ఆరోపణలన్నీ దాదాపు ముగిసినట్లేనని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.


Leave a Reply